దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ తాజా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్కు చెందిన నాలుగు కొత్త ఉపరకాలే కారణమని పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ కొత్త ఉపరకాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఉపయోగపడతాయని వారు తెలిపారు.దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల నమూనాలను విశ్లేషించినప్పుడు ఒమిక్రాన్కు చెందిన నాలుగు ఉపరకాలు వెలుగులోకి వచ్చినట్లు ఎన్ఐవీ-పుణె డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ వివరించారు. "మేము వీటిని ఎల్ఎఫ్.7, ఎక్స్ఎఫ్జీ, జేఎన్.1.16, ఎన్బీ.1.8.1 వేరియంట్లుగా గుర్తించాం. మొదట్లో జేఎన్.1.16 వేరియంట్ వల్ల కేసులు పెరిగినా, ఈ ఏడాది మే నెల నుంచి ఎక్స్ఎఫ్జీ వేరియంట్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎల్ఎఫ్.7, ఎల్పీ.81.2 అనే రెండు వేరియంట్లు కలిసి ఎక్స్ఎఫ్జీగా రూపాంతరం చెందాయి" అని డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి జన్యుక్రమాన్ని విశ్లేషించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ఆయన చెప్పారు.ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,483 కొవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు కరోనా కారణంగా 113 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా కేరళలో కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండగా, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా వైరస్ వ్యాప్తి అధికంగానే ఉంది.అయితే, ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉందని, బాధితులు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండటంతో ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని తెలుస్తోంది. అయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa