ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేక్ ఇన్ ఇండియాతో భారత్ కంటే చైనాకే లాభం.. రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Sat, Jun 21, 2025, 08:10 PM

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం.. పూర్తిగా ఫెయిల్ అయిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా వల్ల మనకంటే ఎక్కువగా చైనాకే లాభాలు వస్తున్నాయని ఆరోపించారు. మేక్ ఇన్ ఇండియా గురించి గొప్పలు చెబుతున్న ప్రధాని మోదీ.. దాన్ని నిజం చేయట్లేదని మండిపడ్డారు. మేక్ ఇన్ ఇండియా నినాదం భారత్‌లో తయారీ రంగానికి ఊతం ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అది జరగడం లేదని, నిరుద్యోగం కూడా భారీగా పెరిగిపోయిందని రాహుల్ గాంధీ తెలిపారు. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడ వస్తువులు తయారు చేయకుండా.. విడి భాగాలను విదేశాల నుంచి తెచ్చి.. వాటన్నింటినీ కలిపి వస్తువులు మాత్రమే తయారు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత విమర్శించారు.


దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్‌ అయిన నెహ్రూ ప్లేస్‌లో తాజాగా రాహుల్‌ గాంధీ పర్యటించి.. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు టెక్నీషియన్లతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే మేక్ ఇన్‌ ఇండియాతో ఫ్యాక్టరీ రంగం అమాంతం పెరుగుతుందని నరేంద్ర మోదీ సర్కార్ చెప్పిందని.. కానీ ఎందుకు తయారీ రంగం రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయిందని ప్రశ్నించారు. అంతేకాకుండా యువతలో నిరుద్యోగిత రేటు భారీగా ఎందుకు పెరిగిందని నిలదీశారు. అదే సమయంలో చైనా నుంచి ఎందుకు రెండు రెట్ల దిగుమతులు పెరిగాయని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.


ప్రధాని మోదీ నినాదాలు చెప్పడంలో గురువు కానీ.. పరిష్కారాలు చూపించడంలో మాత్రం కాదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 2014 నుంచి భారతదేశ తయారీ రంగం.. దేశ ఆర్థిక వ్యవస్థలో 14 శాతానికి పడిపోయిందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో మనం వస్తువులను తయారు చేయట్లేదని.. దిగుమతి చేసుకుని అసెంబ్లింగ్‌ మాత్రమే చేస్తున్నామని వివరించారు. అందుకే ఆ విడి భాగాలను తయారుచేస్తున్న చైనా భారీగా లాభపడుతోందని.. ఇదే నిజమని.. నిజం నిక్కచ్చిగా ఉంటుందని రాహుల్‌ విమర్శించారు.


ఇలా చేయడం వల్ల భారత్‌కు కేవలం అతుకులు మాత్రమే మిగులుతున్నాయని.. లాభాలు మాత్రం చైనాకు వెళ్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో చేస్తున్న పనుల కారణంగా దేశంలో తయారీ రంగం తగ్గి.. నిరుద్యోగం పెరుగుతోందని మండిపడ్డారు. అంతేకాకుండా వస్తువులను ఉత్పత్తి చేసేవారికి ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా కేంద్రం మెల్లగా ఆపేస్తోందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తయారీ రంగంలో మార్పులు తీసుకురావడం అత్యవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వేరే దేశాలు వస్తువులు అమ్ముకునేందుకు మనం ఒక మార్కెట్‌గా ఉండకూడదని.. ఇక్కడే వస్తువుల ఉత్పత్తి చేస్తే.. ఇక్కడే కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు. దీనికి సమయం లేదని.. వెంటనే నిర్ణయం తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa