గుజరాత్లో ఈనెల 12వ తేదీన జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఒకవైపు.. విమానం కూలిన ఘటన కారణాలు తెలుసుకునేందుకు.. దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా.. మరోవైపు.. ఎయిరిండియా నుంచి డీజీసీఏ అన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ క్రమంలోనే ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం.. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరగా.. గాల్లోకి ఎగిరిన కొన్ని సెకన్లకే బీజే మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలి అగ్ని ప్రమాదంలో బూడిదైన ఘటనలో 272 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాన్ని సీరియస్గా తీసుకున్న డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎయిరిండియా సిబ్బంది షెడ్యూలింగ్, రోస్టర్ విధులు నిర్వహించే ముగ్గురు అధికారులను విధుల నుంచి తీసేయాలని డీజీసీఏ.. ఎయిరిండియా సంస్థకు ఆదేశాలు ఇచ్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎయిర్లైన్స్ నిబంధనలను సరిగా పాటించకపోవడం వల్లే.. ఆ ముగ్గురు అధికారులపై చర్యలకు డీజీసీఏ దిగింది. సర్వీసింగ్, లైసెన్సింగ్ లోపాలు ఉన్నా ఎయిరిండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై డీజీసీఏకు ఎయిరిండియా ఇచ్చిన సమాచారం ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై వేటు వేయాలని సూచించింది.
రూల్స్ సరిగా పాటించకుండానే విమాన సిబ్బందిని షెడ్యూల్ చేశారని.. తమ తప్పిదాలపై ఆ ముగ్గురు అధికారులు జవాబుదారీతనం చూపించలేదని పేర్కొంది. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆ ముగ్గురు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీసీఏ తేల్చి చెప్పింది. వెంటనే వారిపై అంతర్గతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇక ఆ ముగ్గురు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపై 10 రోజుల్లోగా తమకు నివేదిక ఇవ్వాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
తొలగించిన ముగ్గురు అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించాలని ఎయిరిండియాకు డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది. తర్వాతి ఆదేశాలు ఇచ్చేవరకు కొత్తగా నియమించిన ఉద్యోగులనే కొనసాగించాలని స్పష్టం చేసింది. మరోవైపు.. బెంగళూరు నుంచి లండన్కు బయలుదేరిన 2 విమానాలు 10 గంటలు ఆలస్యంగా చేరుకోవడంపైనా ఎయిరిండియాకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 7 రోజుల్లోగా ఈ షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు.. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి.. కుటుంబీకులకు అందించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa