ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైనిక చర్య విజయవంతంగా పూర్తి చేశామన్న అమెరికా అధ్యక్షుడు

international |  Suryaa Desk  | Published : Sun, Jun 22, 2025, 08:51 AM

ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా విజయవంతంగా దాడులు పూర్తి చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. "ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్" అణు కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఆయన శనివారం వెల్లడించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక "ట్రూత్ సోషల్"లో ఒక పోస్ట్ చేశారు."ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్‌లతో సహా మూడు అణు స్థావరాలపై మేం చేపట్టిన దాడి చాలా విజయవంతంగా పూర్తయింది. మా విమానాలన్నీ ఇప్పుడు ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేశాయి. ప్రధాన స్థావరమైన ఫోర్డోపై పూర్తిస్థాయి బాంబుల పేలోడ్‌తో దాడి చేశాం. అన్ని విమానాలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణమయ్యాయి. మా గొప్ప అమెరికన్ యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే ఇతర సైన్యం కూడా ఇలాంటి దాడి చేయలేదు. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైంది! ఈ విషయానికి మీరు ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు," అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.ఇరాన్‌లో జరిగిన ఈ "అత్యంత విజయవంతమైన సైనిక చర్య" గురించి జాతినుద్దేశించి రాత్రి 10:00 గంటలకు వైట్‌హౌస్ నుంచి ప్రసంగించనున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. "ఇది అమెరికా, ఇజ్రాయెల్ మరియు ప్రపంచానికి ఒక చారిత్రక ఘట్టం. ఇరాన్ ఇప్పుడు ఈ యుద్ధానికి ముగింపు పలకాలి. ధన్యవాదాలు అని ఆయన మరో పోస్టులో తెలిపారు.కాగా, ఇరాన్ తన అణు కార్యక్రమంపై చర్చలకు రావడానికి గరిష్టంగా రెండు వారాల సమయం ఇస్తున్నట్లు ట్రంప్ శుక్రవారం విలేకరులకు చెప్పారని జిన్హువా వార్తా సంస్థ గతంలో పేర్కొంది.గత వారం, ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాలు, సీనియర్ ఇరానియన్ నాయకులపై వైమానిక దాడుల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ దాడుల్లో అనేక మౌలిక సదుపాయాలు ధ్వంసమవగా, డజన్ల కొద్దీ ఇరానియన్ సైనిక కమాండర్లు మరియు అణు శాస్త్రవేత్తలు మరణించారు. దీనికి ప్రతిగా, ఇరాన్ ఇజ్రాయెల్‌లోని వివిధ ప్రాంతాలపై క్షిపణి మరియు డ్రోన్ దాడులు నిర్వహించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తాజా దాడుల ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa