ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అణు స్థావరాలపై అమెరికా దాడులతో రేడియేషన్ లీక్... ఇరాన్ కీలక ప్రకటన

international |  Suryaa Desk  | Published : Sun, Jun 22, 2025, 10:01 PM

ఇజ్రాయేల్, ఇరాన్ యుద్ధంలోకి అమెరికా నేరుగా దిగడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టయ్యింది. ఇజ్రాయేల్‌కు మద్దతుగా ఇరాన్‌లోని మూడు కీలక అణుకేంద్రాలు ఇస్ఫహాన్, ఫోర్దో, నతాంజ్‌పై అనూహ్యంగా దాడులు చేసింది. అయితే ఈ దాడుల అనంతరం రేడియేషన్ భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అణుశక్తి సంస్థ దీనిపై స్పందిస్తూ.. ఎటువంటి రేడియేషన్ వెలువడలేదని భరోసా ఇచ్చింది. ఇరాన్ జాతీయ అణు భద్రతా కేంద్రం ప్రకారం.. మూడు దాడుల కేంద్రాల్లోని రేడియేషన్ డిటెక్టర్లు ఎలాంటి కిరణ విడుదలను నమోదు చేయలేదని ప్రకటించింది. ఈ ‘ప్రాంత ప్రజలకు ఎలాంటి ముప్పు లేదు’ అని అధికారికంగా వెల్లడించింది.


ఇరాన్‌పై జరిగిన ఈ దాడి అమెరికా మొదటిసారి నేరుగా ఇరాన్ యుద్ధంలో పాల్గొన్న ఉదంతంగా చరిత్రకెక్కింది. B-2 Spirit స్టెల్త్ బాంబర్లు, వర్జీనియా/ లాస్ ఏంజెల్స్ క్లాస్ అణు సబ్‌మెరైన్లు, 12 x GBU-57 ‘బంకర్ బస్టర్’ బాంబులు, 30 x Tomahawk క్రూయిజ్ క్షిపణులు, F-22 Raptor యుద్ధ విమానాలు, F-35 Lightning II ఫైటర్లు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. ఈ దాడుల్లో అత్యంత రహస్య బంకర్‌లో ఉన్న ఫోర్డో అణు కేంద్రం ఒకటి ప్రధాన లక్ష్యంగా మారింది.


ఈ కేంద్రాల్లో ఉపయోగించే యురేనియం హెక్సాఫ్లోరైడ్ (UF6) గాలిలోని తేమతో కలిసినపుడు హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. అయితే, ఇది రేడియేషన్ కన్నా ప్రమాదకరం. ముఖ్యంగా ఈ కేంద్రాలు భూగర్భంలో ఉండటం వల్ల రిస్క్ తక్కువ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బుషెహర్ అణు రియాక్టర్‌పై దాడి జరిగితేనే ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుంది. ఎందుకంటే అదే పెద్ద అణు విద్యుత్ కేంద్రం కావడం వల్ల రేఢియో ధార్మికత విడుదల ప్రమాదం ఉంటుందని అంటున్నారు.


తమ అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఇరాన్ అణుశక్తి సంస్థ విమర్శలు గుప్పించింది. ఫోర్డో, నటాంజ్ , ఇస్ఫహాన్ కేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయని పేర్కొంది. అయితే ఈ దాడులతో తమ జాతీయ అణు విధానానికి ఎలాంటి ఆటంకం కలిగించబోమని తెలిపారు. అణ్వాయుధ అభివృద్ధిపై వెనక్కి తగ్గబోమని సంకేతం ఇచ్చింది. ఈ దాడుల వల్ల ఎంత మేరకు మాకు నష్టం సంభవించలేదని వివరించింది. ఇక, ఇరాన్ కీలక స్థావరాన్ని తాము ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కేవలం శాంతి నెలకొనడం కోసమే తాము ఈ దాడి చేసినట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa