ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో ఆ పార్టీ ఆఫీసు.. 2 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 07:04 PM

అమరావతి రాజధాని నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. పలు సంస్థలకు అమరావతిలో భూములు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో 10 సంస్థలకు అమరావతిలో భూములు కేటాయించారు. గ‌తంలో భూకేటాయింపులు చేసిన 4 సంస్థలకు కేటాయింపులలో మార్పులు చేశారు. అలాగే రెండు సంస్థలకు అమరావతిలో కేటాయించిన భూములను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ వివరాలను ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకం, మూడు రాజ‌ధానుల సిద్ధాంతం కారణంగా అమ‌రావ‌తి అంటే కొన్ని సంస్థలు భ‌య‌ప‌డి వెళ్లిపోయాయ‌ని మంత్రి నారాయణ అన్నారు. గ‌తంలో భూమి కేటాయించిన సంస్థలు స్పందించని పరిస్థితి ఉందన్నారు.


కొత్తగా 10 సంస్థలకు అమరావతిలో భూములు కేటాయిస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ వివరించారు. నాలుగు సంస్థలకు గ‌తంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేశామని.. కొత్తగా ఆరు సంస్థల‌కు కేబినెట్ సబ్ కమిటీ భూకేటాయింపులు చేసిందన్నారు. గతంలో అమరావతిలో భూములు కేటాయించిన రెండు సంస్థలకు కేటాయింపులు రద్దు చేశామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజ‌ధాని భూకేటాయింపుల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో 16 అంశాల‌కు గాను 12 అంశాల‌కు ఆమోదం లభించినట్లు తెలిపారు.


సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్‌కు (CBI) 2 ఎకరాలు, జియలాజిక‌ల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు 3 ఎకరాలు కేటాయింపుల‌ను కొన‌సాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2014- 19లో గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్ బ‌త్తి సంస్థకు చేసిన భూకేటాయింపులు రద్దు చేశారు. ఆదాయ పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.4 ఎకరాలు, ఇంటిలిజెన్స్ బ్యూరో (SIB) కి 0.5 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి 0.5 ఎకరాలు, బీజేపీ కార్యాలయానికి 2 ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.


2014-19 మ‌ధ్య కాలంలో 130 సంస్థల‌కు అమరావతి రాజధాని పరిధిలో 1270 ఎక‌రాలు భూమిని కేటాయించారు. అయితే వాటిలో చాలా వరకూ భవనాలు నిర్మించలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో అమరావతిలో భూములు కేటాయించిన సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ 64 సంస్థల‌కు 884 ఎక‌రాలు కేటాయించారు. సోమవారం మరో పది సంస్థలకు భూకేటాయింపులు జరిగాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా 74 సంస్థలకు భూకేటాయింపులు చేసింది ఏపీ ప్రభుత్వం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa