ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు విమాన ప్రమాదాలు, రెండు తరాలు నాశనం

national |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 07:52 PM

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో.. ఓ వ్యాపారవేత్త కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంలో ఆయన 26 ఏళ్ల ఏకైక కుమార్తె సంజన మరణించడంతో.. ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఈ విమాన దుర్ఘటన వారికి కొత్తేమీ కాదు. గతంలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో కూడా ఈయన కుటుంబానికి చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా ఈయనే ఆస్పత్రికి వెళ్లగా.. తమ ప్రియమైన వ్యక్తి మృతదేహం చూసి విస్తుపోయారు. రెండోసారి కూడా అదే పరిస్థితి ఎదురు కాగా.. గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరి ఆయన కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో.. అదే ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త సౌరిన్ పల్ఖివాలా కుమార్తె 26 ఏళ్ల సంజన ప్రాణాలు కోల్పోయారు. అయితే కన్నబిడ్డ మరణాన్ని తల్చుకుని సౌరిన్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఒక్కగానొక్క బిడ్డ.. అది కూడా మృతదేహం గుర్తించలేని విధంగా మారిపోవడంతో.. ఆ దుఃఖంలోంచి ఇప్పటికీ తేలుకోలేకపోతున్నారు. ఓవైపు విపరీతంగా రోదిస్తూనే మరోవైపు.. తన కుమార్తె జ్ఞాపకాలను అందరికీ వివరిస్తున్నారు. తాను ఇప్పటి వరకు మొత్తంగా రెండు విమాన ప్రమాదాలు చూశానని చెబుతున్నారు.


  "గతంలో కూడా నేను ఒక విమాన ప్రమాద స్థలాన్ని చూశాను. నా కూతురు ఇక లేదని నాకు వెంటనే అనిపించింది. వెంటనే ఆఫీసు నుండి ఇంటికి వెళ్లాను. నా భార్య సోనాలిని తీసుకుని సివిల్ హాస్పిటల్‌కు బయలుదేరాను" అని సౌరిన్ పల్ఖివాలా ప్రమాదం రోజు నాటి భయానక క్షణాలను గుర్తు చేసుకున్నారు. 1988లో జరిగిన విమాన ప్రమాదంలో పల్ఖివాలా తన సోదరి కాబోయే మామ, ప్రముఖ మర్చంట్ బ్యాంకర్ ప్రదీప్ హర్కిషన్ దాస్ దలాల్‌ను కోల్పోయారు. ఇప్పుడు తన ఒక్కగానొక్క కుమార్తె సంజనను కోల్పోయి తీరని దుఃఖంలో ఉన్నారు. సంజన తన కాలేజీ స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం యూకేకి వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది.


కుమార్తె మృతి గురించి మాట్లాడుతూ.. సంజన తమ పెళ్లైన 14 సంవత్సరాల తర్వాత పుట్టిందని, ఆమెను దైవ ప్రసాదంగా తాము బావించామని సౌరిన్ చెప్పారు. సంజన చాలా తెలివైన అమ్మాయి అని వివరించారు. పూణేలో బీబీఏ పూర్తి చేసిన ఆమె న్యూయార్క్ యూనివర్సిటీ నుండి మేనేజ్‌మెంట్ ఆఫ్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేసిందన్నారు. తమ ఇల్లు ఆమె జ్ఞాపకాలు, అద్భుతమైన పెయింటింగ్‌లతో నిండి ఉందని చెప్పారు. సంజన జ్ఞాపకాలతో నిండిన తమ ఇంటిని చూస్తూ.. ఆమె మరణాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని పల్ఖివాలా దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.


సంజనకు ప్రపంచంలోని వివిధ రకాల వంటకాలంటే చాలా ఇష్టంని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఫుడ్ సెక్టార్‌లో వ్యాపారం ప్రారంభించాలని ఆమె కలలు కందని చెప్పారు. సంజన కజిన్ సలోని పల్ఖివాలా మాట్లాడుతూ.. "మేమిద్దరం కవలల్లా ఉండేవాళ్లం. ఆమె టెన్నిస్ ఆడటం ఇప్పుడే మొదలు పెట్టింది. క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండేది. డ్యాన్స్ చేయడం, పుస్తకాలు చదవడం, పెయింటింగ్ వేయడం, ప్రయాణాలు చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం" అని సంజన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ ప్రమాదం పల్ఖివాలా కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కానీ సంజన జ్ఞాపకాలు వారి హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాయని వారు నమ్ముతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa