ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌ 364 ఆలౌట్.. చివరి రోజు ఇంగ్లాండ్ టార్గెట్‌ 350 రన్స్‌

sports |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 11:35 PM

ఇంగ్లాండ్‌తో హెడింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్.. 471 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఆరు పరుగుల లీడ్ లభించింది. దాంతో కలిపి భారత జట్టు.. ఇంగ్లాండ్‌కు 371 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయానికి ఐదో రోజు 350 పరుగులు కావాలి. ఇక భారమంతా భారత బౌలర్లపైనే ఉంది.


ఓవర్‌నైట్ స్కోరు 90/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో రెండు పరుగులు జోడించి 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. దీంతో వంద పరుగుల లోపే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. అప్పటికి ఆధిక్యం ఇంకా వంద పరుగులు కూడా కాలేదు. ఈ సమయంలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ జోడీ అద్భుతంగా ఆడింది.


కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లు నాలుగో వికెట్‌కు 195 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 287 పరుగుల వద్ద రిషభ్ పంత్ (118) నాలుగో వికెట్‌గా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 333 పరుగుల వద్ద కేఎల్ రాహుల్‌ (137) వికెట్‌ను కూడా టీమిండియా కోల్పోయింది. ఇక రాహుల్ ఔట్ అయిన తర్వాత భారత జట్టు పేకమేడను తలపించింది.


తొలి ఇన్నింగ్స్‌లో చివరి ఏడు వికెట్లను కేవలం 41 పరుగుల వ్యవధిలో కోల్పోయింది భారత్. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే రిపీట్ చేసింది. చివరి ఆరు వికెట్లను 31 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. దీంతో అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అత్యధికంగా బ్రైడన్ కార్స్ 3 వికెట్లు, జోష్ టంగ్ 3 వికెట్లు తీశారు. బషీర్ 2, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు.


అనంతరం 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 21/0 పరుగులతో నిలిచింది. క్రీజులో జాక్ క్రాలీ (12), బెన్ డకెట్ (9)లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంగ్లాండ్ చివరి రోజు ఆటలో 350 పరుగులు చేయాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa