ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమిపాలైన ఇండియా

sports |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 07:28 PM

లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం పాలైన విష‌యం తెలిసిందే. ఈ ఓటమితో టీమిండియా ఒక అవాంఛనీయ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు సాధించి కూడా ఓటమి చవిచూసిన తొలి జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇరు జట్ల ఆటగాళ్లు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు నమోదు చేశాడు. అతను వరుసగా 134, 118 పరుగులు సాధించాడు. అతనితో పాటు యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మన్ గిల్ (147), కేఎల్ రాహుల్ (137) కూడా సెంచరీలతో కదం తొక్కారు. ఈ ఐదు శతకాలతో భారత్ భారీ స్కోర్లు సాధించినప్పటికీ, బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు.మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 371 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.కాగా, టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఐదు సెంచరీలు నమోదైన తర్వాత కూడా ఓటమిపాలైన జట్టుగా భారత్ నిలవడం గమనార్హం. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1928-29 యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఒక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నాలుగు సెంచరీలు చేసినప్పటికీ, ఆ జట్టు ఓటమిని చవిచూసింది. ఆ మ్యాచ్‌లోనే దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మాన్ తన కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేయడం విశేషం. ఇప్పుడు ఆ రికార్డును టీమిండియా అధిగమించి, ఐదు సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరింది. ఈ ఓటమి భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa