జమ్మూకశ్మీర్లో దొంగతనం ఆరోపణలపై పట్టుబడిన ఓ వ్యక్తి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. రోగి సహాయకుడి వద్ద నుంచి వేలాది రూపాయలు అపహరించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పోలీసులు దేహశుద్ధి చేయడమే కాకుండా, మెడలో చెప్పుల దండ వేసి పోలీసు వాహనం బానెట్పై కూర్చోబెట్టి ఊరేగించారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.పూర్తి వివరాల్లోకి వెళితే... కొద్ది రోజుల క్రితం ఓ ఆసుపత్రి వద్ద రోగి కోసం మందులు కొనుగోలు చేస్తున్న వ్యక్తి నుంచి నిందితుడు సుమారు రూ. 40 వేలు దొంగిలించి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. తాజాగా బాధితుడు అదే ఆసుపత్రి పరిసరాల్లో నిందితుడిని గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో బాధితుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని సమాచారం. ఆ సమయంలో అక్కడే గస్తీ కాస్తున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అయితే, చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి, కొందరు పోలీసులు ఆ వ్యక్తి చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతని మెడలో చెప్పుల దండ వేసి, పోలీసు వాహనం బానెట్పై కూర్చోబెట్టి నడివీధుల్లో ఊరేగించడం కలకలం రేపింది. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రజల సమక్షంలో పోలీసులు ఒక వ్యక్తిని ఇలా అవమానించడం చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని, ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa