ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్ట్రిక్‌ స్కూటీ పేలి మహిళ మృతి.. ఆ చిన్న తప్పుతో, అయ్యో ఎంత ఘోరం

Crime |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 09:08 PM

కడప జిల్లాలో విషాద ఘటన జరిగింది.. ఎలక్ట్రిక్‌ స్కూటీ పేలి మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో.. గురువారం రాత్రి స్కూటీకి ఛార్జింగ్‌ అవుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో పక్కనే నిద్రిస్తున్న మహిళ అక్కడికక్కడే చనిపోయారు. మృతురాలిని వెంకట లక్ష్మమ్మ (62)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఈ పేలుడుకు కారణాలపై ఆరా తీస్తున్నారు. స్కూటీకి ఛార్జింగ్ పెట్టే సాకెట్‌లో ఏదైనా సమస్య ఉందా?.. బైక్‌లో సమస్యతో పేలిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ బైక్ తయారీ సంస్థకూ ఘటనపై సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే రాత్రి ఛార్జింగ్ పెట్టి అలా వదిలేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందా అనే చర్చ జరుగుతోంది.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.


మృతురాలి కుమారుడు ఉదయాన్నే పొలం పనుల కోసమని ఎలక్ట్రిక్ స్కూటీకి ఛార్జింగ్ పెట్టారు. అయితే, ఆ సమయంలో పక్కనే సోఫాలో ఆ వ్యక్తి అమ్మగారైన వెంకటలక్ష్మమ్మ నిద్రిస్తుంది. అయితే, ఎప్పుడూ పెట్టే ఛార్జింగే కదా అని ప్లగ్ పెట్టి.. వాళ్ల వాళ్ల పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ, అది కొద్దిసపేటికే పెద్ద శబ్దంతో బాంబ్‌లా పేలిపోయింది. దీంతో వెంకటలక్ష్మమ్మ శరీరం మొత్తం కాలిపోయింది. ఆమె స్పాట్‌లోనే మృతి చెందింది. పేలుడు ధాటికి మంటలు మెుదటి ఫ్లోర్ వరకు వ్యాపించాయి. పక్కనే ఉన్న అనేక వస్తువులు కాలి బూడిదయ్యాయి.


అయితే, స్కూటీ కొని రెండున్నరేళ్లు అవుతుందని మృతురాలి బంధువులు చెబుతున్నారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది రాలేదని.. అయితే, ఇలా ఒక్కసారిగా పేలుతుందని కలలో కూడా ఊహించలేదని అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఊహించని ఘటనతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


ఇటీవల కాలంలో ప్రజలు పెట్రోల్ బైక్‌లు, స్కూటీలు పక్కనపెట్టి కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ బైకుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి.. పొల్యూషన్ నుంచి బయటపడొచ్చంటున్నారు. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఈ వాహనాలు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా.. చాలామంది గాయపడ్డారు. ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు పేలడం ఆందోళన కలిగిస్తోంది.


కొన్ని సందర్భాల్లో స్కూటీ, బైక్‌ల బ్యాటరీలు పేలిన సందర్భాల ఉన్నాయి. అలాగే కొందరు ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టిన కారణంగా వేడెక్కి పేలే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు ఛార్జర్‌ల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటీలను, బైక్‌లను వేడిగా ఉండే ప్రదేశాల్లో, ఎండలో ఉంచకూడదంటున్నారు. బ్యాటరీ వేడెక్కి పేలుడు జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటీలు ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టే సమయంలో ఛార్జర్‌, బ్యాటరీలను చెక్ చేసుకోవాలంటున్నారు. అలా ఛార్జింగ్ పెట్టి వదిలేయకుండా.. ఎప్పటికప్పుడు ఛార్జింగ్ అవుతుందో , లేదో గమనించాలని.. ఛార్జింగ్ పూర్తి కాగానే బైక్‌ను పక్కకు తీయాలి అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa