ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి వర్షాలు పలకరించనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన సమాచారం ప్రకారం, ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆదివారం నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై కూడా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ అల్పపీడనం కారణంగా ప్రధానంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో రేపు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. అదే సమయంలో, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa