ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైలో 70 ఏళ్ల వృద్ధ వైద్యురాలికి భారీ సైబర్ మోసం

national |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 06:02 PM

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో అమాయకులను మోసగిస్తున్నారు. తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సాగుతున్న మోసాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చట్టం, పోలీసులంటే ఉండే భయాన్ని ఆసరాగా చేసుకుని, ప్రముఖ కేసుల్లో ప్రమేయం ఉందంటూ బెదిరించి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఈ తరహా మోసానికి గురైన ముంబైకి చెందిన 70 ఏళ్ల వైద్యురాలు ఏకంగా రూ.3 కోట్లు పోగొట్టుకున్నారు. నేరగాళ్లు ఆమెను 8 రోజుల పాటు డిజిటల్ మాధ్యమంలో నిర్బంధించి ఈ దారుణానికి పాల్పడ్డారు.ముంబైలో నివసిస్తున్న 70 ఏళ్ల వైద్యురాలికి మే 28న అమిత్ కుమార్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను టెలికాం డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, "మీ ఆధార్ కార్డు ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు కొత్త సిమ్ కార్డు తీసుకున్నారు. ఆ సిమ్ కార్డు వినియోగదారుడిపై ఇప్పటికే కేసు నమోదైంది" అని చెప్పి ఆమెలో ఆందోళన రేకెత్తించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే, ముంబై సైబర్ క్రైమ్ విభాగం పేరుతో ఆమె వాట్సాప్ కు ఒక సందేశం వచ్చింది. కేసు విచారణకు వ్యక్తిగత వివరాలు పంపాలని కోరగా, భయపడిన ఆమె వారు అడిగిన వివరాలన్నీ పంపించారు.కొన్ని రోజుల తర్వాత, అదే వాట్సాప్ నంబర్ నుంచి ఆమెకు మరో కాల్ వచ్చింది. ఈసారి ఫోన్ చేసిన వ్యక్తి, తాను ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేసే ఐపీఎస్ అధికారి సమర్థన్ పవార్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు కూడా ఉందని నమ్మబలికాడు. గోయల్ ఇంట్లో సోదాలు చేస్తుండగా ఆమె పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డు దొరికాయని, ఈ కేసులో తీవ్రమైన శిక్ష పడుతుందని బెదిరించాడు. తన మాటలను ఆమె నమ్మేందుకు, కేసుకు సంబంధించినవంటూ కొన్ని నకిలీ పత్రాలను కూడా వాట్సాప్‌లో పంపించాడు.ఈ పరిణామాలతో తీవ్ర భయాందోళనలకు గురైన బాధితురాలికి, పోలీసు దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. మనీలాండరింగ్ కేసు తీవ్రమైనది కావడంతో ఆమెను 'డిజిటల్ అరెస్ట్' చేస్తున్నట్లు ప్రకటించాడు. 8 రోజుల పాటు ఎక్కడికీ వెళ్లకూడదని, ఎవరితోనూ మాట్లాడకూడదని, నిరంతరం తమ పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించాడు. విచారణలో భాగంగా ఆమె బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును తాము చెప్పే వేర్వేరు ఖాతాలకు బదిలీ చేయాలని, ఆ డబ్బును పరిశీలించాక తిరిగి పంపుతామని ఒత్తిడి చేశాడు.కేసు నుంచి బయటపడాలనే ఆందోళనలో ఉన్న ఆ వైద్యురాలు, వారు చెప్పినట్టే విడతలవారీగా దాదాపు రూ.3 కోట్లను వారి ఖాతాలకు బదిలీ చేసింది. 8 రోజుల తర్వాత, కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నామని చెప్పి నేరగాళ్లు ఆమెతో సంబంధాలు తెంచుకున్నారు. జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పడంతో, ఇది సైబర్ మోసమని వారు అనుమానించారు. వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు కాజేసిన సొమ్ములో నుంచి రూ.82 లక్షలను ఇప్పటికే క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa