వల్లభనేని వంశీకి ఒకేరోజు ఊరట, ఉత్కంఠ ఎదురయ్యాయి. తనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైందని భావిస్తున్న తరుణంలోనే, ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం రేపు విచారణ చేపట్టనుండటంతో వంశీ భవితవ్యం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో నమోదైన నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఈరోజు నూజివీడు కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని, వారానికి రెండుసార్లు సంబంధిత పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని న్యాయస్థానం షరతులు విధించింది. ఈ కేసుతో కలిపి తనపై నమోదైన మొత్తం 10 కేసుల్లోనూ వంశీకి బెయిల్ లభించినట్లయింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కావడం ఖాయమని ఆయన వర్గీయులు భావించారు.అయితే, వంశీకి లభించిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై రేపు విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఒకవైపు కింది కోర్టుల్లో అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించినప్పటికీ, మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్ విచారణకు రానుండటంతో ఆయన విడుదల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రేపటి విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపైనే వంశీ విడుదల ఆధారపడి ఉంది.గత ఫిబ్రవరి 13న హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మైహోం భుజా అపార్ట్మెంట్లో వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఆరోపణలతో భారతీయ న్యాయ సంహిత పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనపై వరుసగా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ, కోలుకున్న తర్వాత తిరిగి జైలుకే తరలించారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూ రాగా, తాజాగా అన్ని కేసుల్లోనూ ఊరట లభించింది. అయితే, సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్ రూపంలో మరో న్యాయపోరాటం ఆయన ముందు నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa