వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగయ్య కుటుంబ సభ్యులు వైఎస్ జగన్ను బుధవారం కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, కుమారులు, కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారిని పరామర్శించారు. కుటుంబం బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య ప్రాణాలు కోల్పోయారు. పెద్ద దిక్కును కోల్పోయిన సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే రూ. 10 లక్షల ఆర్ధిక సాయం సింగయ్య కుటుంబానికి అందజేసింది. బుధవారం సింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్.. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వైఎస్ జగన్ ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటించారు. అయితే జగన్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. వైఎస్ జగన్ కారు కింద పడి చీలి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు. దీనికి సంబంధించి వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు వైఎస్ జగన్తో పాటు ఇతర వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో వైఎస్ జగన్ను ఏ2గా చేర్చారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ వైఎస్ జగన్ సహా ఇతర నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు, రాజకీయ కక్ష పూరితమైన కేసు అని.. దీనిని కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ను మంగళవారం విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. అనంతరం ఈ పిటిషన్ మీద విచారణను ఏపీ హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. తాజాగా చీలి సింగయ్య కుటుంబ సభ్యులు వైఎస్ జగన్ను కలిశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa