వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో, సుమారు 140 రోజుల తర్వాత ఆయన విజయవాడ సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలోనే గత ఫిబ్రవరి 16న ఏపీ పోలీసులు ఆయన్ను హైదరాబాద్లో అరెస్టు చేసి జైలుకు తరలించారు. అప్పటి నుంచి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయన, తన అరెస్టుపై న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. తాజాగా ఇళ్ల పట్టాల కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన నూజివీడు న్యాయస్థానం, షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.వంశీ విడుదల సందర్భంగా విజయవాడ జైలు వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన భార్య పంకజ శ్రీతో పాటు వైసీపీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరిలో కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవభక్తుని చక్రవర్తి తదితరులు ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా భారీగా చేరుకుని ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa