ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫేక్ రికార్డులు.. ఎయిరిండియాకు డీజీసీఏ గట్టి వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 09:33 PM

గత నెలలో జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదం తర్వాత విమానాల భద్రత విషయంలో అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వహణ విషయంలో ఎయిర్‌లైన్స్ ఉదాసీనంగా వ్యవహరించి, ప్రయాణికుల ప్రాణాలను ఫణంగా పెడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రికార్డుల్లో తప్పుడు సమాచారం, మోసపూరిత మార్పులపై ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మార్చిలోనే గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ యూరోపియన్ యూనియన్ విమాన భద్రతా సంస్థ (EASA) మార్గదర్శకాలను పాటించలేదని గుర్తించిన డీజీసీఏ.. తీవ్రంగా స్పందించింది. ఎయిర్‌బస్ A320లో భాగాలను సమయానికి మార్చకపోవడం, రిపోర్టుల్లో తప్పుడు సమాచారం నమోదు చేయడం వంటివి చేసినట్టు నిర్దారించింది. యూరోపియన్ యూనియన్ 2023లో జారీ చేసిన ఎయిర్ వర్తినెస్ డైరెక్టివ్ ప్రకారం.. CFM LEAP-1A ఇంజిన్‌లలో కొన్ని భాగాలను తప్పనిసరిగా మార్చాల్సి ఉంది. ఈ భాగాలను మార్చకపోతే విమానం దెబ్బతీనే ప్రమాదం ఉండేదని ఈఏఎస్ఏ హెచ్చరించింది.


ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన VT-ATD అనే విమానంలో ఈ మార్పులు చేయాల్సి ఉండగా.. కేంద్ర పౌర విమానయాన శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తన ఆడిట్‌లో అవి చేయలేదని, పైగా రికార్డుల్లో తప్పుడు ఎంట్రీలు చేశారని గుర్తించింది. అయితే, రికార్డుల మైగ్రేషన్ సమయంలో ప్లానింగ్ మిస్ అయిందని అంగీకరించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, తప్పులను గుర్తించిన వెంటనే భాగాల మార్పు చేపట్టామని తెలిపింది. కానీ, డీజీసీఏ ఆరోపించిన తప్పుడు రికార్డులపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. దీని బాధ్యులను చేస్తూ క్వాలిటీ మేనేజర్‌ను తొలగించడం, ఎయిర్‌వర్తినెస్ డిప్యూటీ మేనేజర్‌ను సస్పెండ్ చేయడం వంటి చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.


ఎయిరిండియా విమాన ప్రమాదంలో కీలకమైన బ్లాక్ బాక్స్ విశ్లేషణ ఇంకా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. VT-ATD అనే విమానం సాధారణంగా దేశీయ, దుబాయ్, మస్కట్ వంటి అంతర్జాతీయ మార్గాల్లో సేవలు అందిస్తుంది. ఈ సమస్యను 2024 అక్టోబరులో నిర్వహించిన ఆడిట్ సమయంలోనే డీజీసీఏ మొదట గుర్తించింది. ఇంజిన్ విభాగాలు మార్చాల్సిన తేదీ తర్వాత కూడా కొన్ని ప్రయాణాలు చేసినట్టు సమాచారం. భారత విమాన ప్రమాదాల పరిశోధనా విభాగం (AAIB) లీగల్ సెల్ మాజీ అధికారి విభూతి సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి లోపాలు వెంటనే సరిచేయాలి. సముద్రం పైన గాని, పరిమిత గగనతలంలో గాని విమానాలు నడిచేటప్పుడు ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుంది. ఇది చాలా ఘోర తప్పిదం’’ అని అన్నారు. మొత్తం 23 భద్రతా ఉల్లంఘనలపై హెచ్చరికలు లేదా చర్యలు చేపట్టినట్టు పార్లమెంటులో ప్రభుత్వం 2023లో ప్రకటించింది. ఇందులో 3 కేసులు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, 8 కేసులు ఎయిరిండియాలకు సంబంధించినవే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa