ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిమాచల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ కంగన

national |  Suryaa Desk  | Published : Mon, Jul 07, 2025, 04:50 PM

హిమాచల్ ప్రదేశ్‌లో వరద బాధితులను ఉద్దేశించి మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. సాయం చేయడానికి తన వద్ద విపత్తు నిధులు గానీ, కేంద్రమంత్రి పదవి గానీ లేవంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. అయితే, తాను వాస్తవ పరిస్థితులనే వివరించానని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన వ్యాఖ్యలను వక్రీకరిస్తోందని కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఒక్క మండి జిల్లాలోనే మృతుల సంఖ్య 75కు చేరింది. ఈ నేపథ్యంలో ఆదివారం తన నియోజకవర్గంలోని తునాగ్ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో కంగన పర్యటించారు.ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడుతూ "కుటుంబాలను ఆదుకోవడానికి నా దగ్గర తక్షణమే ఇచ్చేందుకు విపత్తు నిధులు లేవు. నేను క్యాబినెట్ మంత్రిని కూడా కాదు" అని వ్యాఖ్యానించారు. అయితే, కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. సర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రజలను ఓదార్చాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారిని మరింత బాధపెట్టడమేనని విమర్శించాయి.ఈ విమర్శలపై కంగన ఘాటుగా స్పందించారు. "ఒక ఎంపీగా నేను ఏం చేయగలనో, నాకున్న పరిమితులేంటో ప్రజలకు స్పష్టంగా చెప్పాను. నిధులు లేనప్పుడు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత. కానీ, బాధితులను ఆదుకోవడం మానేసి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నా మాటలపై తప్పుడు ప్రచారం చేస్తోంది" అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఎలాంటి సహాయం చేయడం లేదని కూడా ఆమె ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa