తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. జూలై నెలలో రెండు రోజుల పాటు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 16వ తేదీన తిరుమలలో ఆణివార ఆస్థానం జరగనుంది. ఈ క్రమంలోనే జూలై 15న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. తిరుమలలో ఏటా నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో ఆలయాన్ని శుద్ధి చేస్తారు.
ఈ క్రమంలోనే జూలై 15న ఉదయం 6 గంటలకు తిరుమంజనం ప్రారంభమవుతుంది. సుమారు 5 గంటలపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తిరుమంజనం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం సందర్భంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఇక జూలై 16న జరిగే ఆణివార ఆస్థానం సందర్భంగా ఉదయం 7 గంటలకు ఆలయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో మలయప్పస్వామి గరుత్మంతునికి అభిముఖంగా కొలువుచేస్తారు. మరో పీఠంపై విష్వక్సేనులు వేంచేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.
తిరుమలలో ఆణివార ఆస్థానం సందర్భంగా జూలై 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారు పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆణివార ఆస్థానం నేపథ్యంలో జూలై 16న కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం నేపథ్యంలో జూలై 15, జూలై 16 తేదీలలో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాలను భక్తులు గమనించాలని టీటీడీ సూచించింది. అలాగే జూలై 14, 15వ తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలు స్వీకరించమని స్పష్టం చేసింది.
మరోవైపు తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్, జనతా క్యాంటిన్లలో నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్ధాలు అందించాలని టీటీడీ ఈవో సూచించారు. తిరుమలలోని హోటళ్ల నిర్వాహకులతో బుధవారం ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు సేవా దృక్పధంతో నాణ్యమైన ఆహార పదార్థాలు, పరిశుభ్రత, లాభాపేక్ష లేకుండా నిర్ధేశించిన ధరలకు అందించాలని టీటీడీ ఈవో శ్యామలారావు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa