ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జింబాబ్వేపై 367 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ముల్డర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్

sports |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 06:36 AM

క్రికెట్‌లో వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని కొందరు భావిస్తారు. అయితే, ఒక చారిత్రక రికార్డుకు అత్యంత సమీపంలో ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే దక్షిణాఫ్రికా, జింబాబ్వే టెస్టులో చోటుచేసుకుని ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ 367 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంతో, టెస్టుల్లో బ్రియాన్ లారా పేరిట ఉన్న 400 పరుగుల అజేయ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టే సువర్ణావకాశాన్ని అతడు చేజార్చుకున్నాడు. ఈ విషయంపై వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఒక రేడియో షోలో మాట్లాడుతూ, ముల్డర్ తీసుకున్న నిర్ణయాన్ని గేల్ తప్పుబట్టాడు. ‘‘నాకు గనక అలాంటి అవకాశం వస్తే 400 పరుగులు చేయడానికి కచ్చితంగా ప్రయత్నిస్తాను. ఎందుకంటే అలాంటి అవకాశాలు పదేపదే రావు. ముల్డర్ ఆ రికార్డు లారా పేరు మీదే ఉండాలని కోరుకున్నాడేమో. కానీ నా దృష్టిలో అది సరైన నిర్ణయం కాదు. బహుశా ఆ స్థితిలో అతడు ఒత్తిడికి, భయాందోళనకు గురై ఉంటాడు’’ అని గేల్ అభిప్రాయపడ్డాడు.కాగా, ఈ ఇన్నింగ్స్‌తో ముల్డర్ ఒక కొత్త రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో హషీమ్ ఆమ్లా (311*) పేరిట ఈ రికార్డు ఉండేది. ముల్డర్ తన ఇన్నింగ్స్‌లో 334 బంతులు ఎదుర్కొని 49 ఫోర్లు, 4 సిక్సర్లతో 367 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa