యెమెన్లో మరణశిక్ష పడిన కేరళ నర్సు నిమిష ప్రియ భవితవ్యం ప్రస్తుతం 'రక్తపు డబ్బు' (బ్లడ్ మనీ) చెల్లింపుపైనే ఆధారపడి ఉంది. ఆమెను ఉరిశిక్ష నుంచి కాపాడటానికి 'బ్లడ్ మనీ' పరిష్కారం ఒక్కటే మార్గమని భారత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసు అత్యంత సంక్లిష్టమైనదని.. దౌత్యపరంగా పలు సవాళ్లు ఎదురవుతున్నాయని కేంద్రం పేర్కొంది. దీంతో ఈ కేసుపై సుప్రీం కోర్టు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిమిష ప్రియను రక్షించడానికి కేంద్రం తీసుకున్న చర్యలపై వివరణాత్మక అఫిడవిట్ను సమర్పించాలని కోరింది. దౌత్యపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ.. ప్రాణాలను కాపాడటానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.
నిమిష ప్రియను 2020లో యెమెన్కు చెందిన తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో దోషిగా అక్కడి కోర్టు నిర్ధారించింది. అయితే ఈ హత్య మాత్రం 2017లో జరిగింది. ఈ కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష విధించగా.. ఆమె చేసిన అప్పీల్ను యెమెన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ 2024 నవంబర్లో తిరస్కరించింది. యెమెన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆమె శిక్షను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నిమిషా ప్రియ సనా సెంట్రల్ జైలులో ఖైదీగా ఉంది. అయితే ఓవైపు మరణ శిక్ష గడువు (జులై 16వ తేదీ) సమీపిస్తున్నప్పటికీ, ఏదైనా అద్భుతం జరిగి ఆమె ప్రాణాలతో తిరిగి రాకపోతుందా అని దేశ ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా ఆమెను కాపాడేందుకు ఇప్పటికే ఆమె తల్లి యెమెన్ వెళ్లారు. భర్త ఇక్కడే ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విదేశాంగ శాఖ మంత్రులను, అధికారులను కలుస్తున్నారు. ఎలాగైనా తమకు సాయం చేసి నిమిష ప్రియను కాపాడాలని వేడుకుంటున్నారు. అయితే భారత ప్రభుత్వం కూడా నిమిష ప్రియను రక్షించడానికి అనేక స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్లో రాజకీయ అస్థిరత, ముఖ్యంగా ఆమె జైలులో ఉన్న సనా (హౌతీ నియంత్రణలో ఉన్న ప్రాంతం)తో ప్రత్యక్ష దౌత్య సంబంధాలు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ క్లిష్టమైన పరిస్థితుల కారణంగా, ఆమెను కాపాడటానికి ప్రభుత్వ జోక్యం పరిమితంగా ఉందని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.
యెమెన్ చట్టాల ప్రకారం.. మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి 'దియ్యా' లేదా 'బ్లడ్ మనీ' చెల్లింపు ఒక్కటే ఏకైక మార్గం. దీని ద్వారా బాధితుడి కుటుంబం నిందితుడిని క్షమించే అవకాశం ఉంటుంది. అయితే తలాల్ అబ్దు మహ్ది కుటుంబం యెమెన్లో ఉంది. అలాగే వారిని ఈ పరిష్కారానికి ఒప్పించడం అనేది చాలా పెద్ద సవాలుగా మారింది. నిమిష ప్రియ తల్లి ప్రేమ కుమారి.. తన కుమార్తెను కాపాడటానికి 'బ్లడ్ మనీ' కోసం విరాళాలు అందించాల్సిందిగా ప్రజలను అభ్యర్థిస్తున్నారు. బిడ్డ లేకుండా తాను దేశానికి తిరిగి వచ్చే అవకాశమే లేదంటున్నారు. కేంద్రం కూడా ఆమెను కాపాడడం కష్టమేనని తాజాగా చెప్పడంతో.. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అంతా మరింత నిరాశకు లోనవుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa