రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఏడుగుర్రాలపల్లిలో సామూహిక లైంగిక దాడికి గురైన దళిత బాలికను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సోమవారం శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర హోంమంత్రి అనితను అడ్డుకుంటామని హెచ్చరించారు. రామగిరి మండలంలోని ఏడుగుర్రాలపల్లిలో సామూహిక లైంగిక దాడికి గురైన దళిత బాలిక మూడు రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, మహిళా విభాగం నేతలు అనంతపురం సర్వజనాస్పత్రిలో బాలికను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఆస్పత్రి ఎదుటే వారు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న అనిత దళితురాలై ఉన్నా తమ వర్గానికి న్యాయం జరగడం లేదని అన్నారు. ఇటీవల మహిళా కమిషన్ చైర్పర్సన్ జిల్లాకు వచ్చి వెళ్లినా దళిత బాలికకు న్యాయం జరగలేదన్నారు. ఇప్పుడు ఆ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు. తల్లీబిడ్డ సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలన్నారు. బాధిత బాలికను పరామర్శించేందుకు వెళ్తుంటే తమను అడ్డుకోవడం దారుణమన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అంటూ ధ్వజమెత్తారు. అలాగే అనంతపురంలో ఇంటర్ చదువుతున్న గిరిజన విద్యార్థిని తన్మయిని హత్య చేసినా ఆ కుటుంబాన్ని ఆదుకున్న దాఖలా లేదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంఎస్ రాజు, బండారు శ్రావణి ఎమ్మెల్యేలుగా గెలిచినా దళితుల సంక్షేమం గురించి ఆలోచించడం లేదన్నారు. దళిత సంఘాల ద్వారా రాజకీయంగా ఎదిగిన ఎంఎస్ రాజు అదే దళితులకు అన్యాయం జరిగుతుంటే నోరుమెదపట్లేదని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa