ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్‌ భవనంపై కూలిన సైనిక విమానం.. 19 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 08:31 PM

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని ఢాకాలో సోమవారం మధ్యాహ్నం ఓ సైనిక విమానం కుప్పకూలింది. ఢాకా ఉత్తరా ప్రాంతంలో ఉన్న మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 19 మృతి చెందగా, వంద మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో 16 మంది విద్యార్థులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. బంగాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన F-7 BGI జెట్ ప్రమాదానికి గురైనట్టు ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. పది మందికిపైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. కాగా, ఈ ఘటన జూన్ 12న అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో జరిగిన ఎయిరిండియా ప్రమాదాన్ని గుర్తుచేస్తోంది. ఎయిరిండియా విమానం కూడా మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలి.. అందులోని 30 మంది ప్రాణాలు కోల్పోయారు.


విమానం కూలిన తర్వాత ఘటనా స్థలిలో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలను స్థానిక మీడియా ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక, సైనిక బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపుచేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదం తర్వాత విద్యా సంస్థ ప్రాంగణంలో విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారు. కాగా, గత నెలలో రాజస్థాన్‌లో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కూలింది.


అగ్నిమాపక విభాగం అదికారి లిమా ఖాన్ మాట్లాడుతూ.. ‘విమానం కూలిన ఘటనలో కనీసం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నలుగురికి గాయాలయ్యాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది’ అని తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


కాగా, ఈ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విమానం మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ గేట్‌పైనే కుప్పకూలినట్లు విద్యా సంస్థ ప్రతినిధి తెలిపారు. ‘విమానం నేరుగా స్కూల్ గేటుపై పడింది. కుప్పకూలిన సమయంలో ఆ ప్రాంగణంలో తరగతులు కొనసాగుతూనే ఉండటం వల్ల విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. గాయపడ్డవారిని ఒక్కొక్కరిగా బయటకు తీస్తున్నాం’ అని చెప్పారు. చైనా తయారు చేసిన F-7 BGI మోడల్ విమానాలను బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ప్రధానంగా శిక్షణ కోసం వినియోగిస్తుంది. విమానం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. సాంకేతిక వైఫల్యమా? మానవ తప్పిదమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa