ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకృష్ణ పరమాత్ముడికి కానుకగా రివాల్వర్, బుల్లెట్

national |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 07:53 PM

సాధారణంగా మనం ఏదైనా గుడికి వెళ్లినప్పుడు ఆయా దేవుళ్లు ఇష్టపడే వస్తువులు లేదా కొబ్బరి కాయలు, ప్రసాదాలు, పూల మాలలు, స్వీట్లు, పండ్లు వంటివి తీసుకెళ్తుంటాం. ఏదైనా మొక్కుకున్న వాళ్లు అయితే బంగారు, వెండి ఆభరాణాలతో పాటు నగదు లేదా ధాన్యం వంటి వాటిని కూడా కానుకలుగా సమర్పిస్తుంటారు. కానీ తాజాగా ఓ గుడికెళ్లిన భక్తుడు.. దేవుడికి కానుకగా రివాల్వర్ , బుల్లెట్, అంతేకాకుండా రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా సమర్పించాడు. అదేంటీ.. ఇవన్నీ దేడువికా అని ఆశ్చర్యపోతున్నారా. అవునండీ నిజం. ఓ భక్తుడు వీటినే శ్రీకృష్ణ పరమాత్ముడికి కానుకలుగా సమర్పించాడు. మరి ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా..?


రాజస్థాన్‌లోని చిత్తూరుగఢ్ జిల్లాలో ఉన్న ప్రముఖ శ్రీ సాన్వాలియా సేథ్ ఆలయంలో ఒక అసాధారణమైన కానుక భక్తులను, ఆలయ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఇక్కడ శ్రీకృష్ణు పరమాత్ముడు వెలిసి ఉండగా.. ఓ అజ్ఞాత భక్తుడు దేవుడికి ఏకంగా ఒక వెండి రివాల్వర్‌ దానితో పాటు ఒక వెండి బుల్లెట్‌.. అంతేకాకుండా వెండితో చేసిన రెండు వెల్లుల్లి రెబ్బలను సమర్పించారు. ఎవరూ ఊహించని విధంగా ఇలాంటి వస్తువులను సమర్పించడంతో ఆలయు అధికారులు సహా భక్తులంతా ఆశ్చర్య పోతున్నారు.


ముఖ్యంగా ఈ విచిత్ర సమర్పణ గురించి ఆలయ ఛైర్మన్ జనకీ దాస్ అలియాస్ హజారీ దాస్ వైష్ణవ్ ధ్రువీకరించారు. సుమారు 300 గ్రాముల బరువు ఉన్న వెండి రివాల్వర్, 190 గ్రాముల బరువు ఉన్న వెండి బుల్లెట్‌ను భక్తుడు దేవుడికి సమర్పించారని తెలిపారు. దేవాలయ చరిత్రలో ఒక ఆయుధాన్ని కానుకగా సమర్పించడం ఇదే మొదటిసారి సారి అని అన్నారు. ఈ అసాధారణ కానుక వెనుక భక్తుడి ఉద్దేశ్యంపై స్థానికంగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం రాజస్థాన్‌లో వెల్లుల్లి ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో.. లాభపడిన ఒక రైతు లేదా వ్యాపారి ఈ కానుకను సమర్పించి ఉండవచ్చని ప్రజలు భావిస్తున్నారు.


శ్రీ సాన్వాలియా సేథ్ ఆలయం 'సేథ్ జీ' లేదా సంపదకు అధిపతి అయిన శ్రీకృష్ణుడికి అంకితం చేశారు. భక్తుల కోరికలను నెరవేరుస్తుందని ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి భక్తులు తరచుగా వచ్చి కోరికలు కోరుకుంటారు. అవి నెరవేరిన తర్వాత వెండితో చేసిన ఇళ్లు, పెట్రోల్ పంపులు, విమానాలు, ట్రాక్టర్లు, చివరికి ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్‌లు వంటి అసాధారణ వస్తువులను కూడా కానుకలుగా సమర్పించారు. చిత్తూరుగఢ్ నుండి సుమారు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం.. రాజస్థాన్‌లో కానుకల ద్వారా గణనీయమైన ఆదాయాన్ని పొందే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒకటి. ఈ తాజా వెండి రివాల్వర్, బుల్లెట్, వెల్లుల్లి సమర్పణ ఆలయ చరిత్రలో ఒక ఆసక్తికరమైన సంఘటనగా నిలిచిపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa