ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి .. ఆ టికెట్ల దర్శనం వేళలు మారాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 07:45 PM

 తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. శ్రీవాణి టికెట్ల దర్శనం వేళల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవాణి దర్శనం వేళలు మారనున్నాయి. ఈ విషయంపై టీటీడీ ఓ ప్రకటన జారీ చేసింది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఆగస్ట్ 15వ తేదీ వరకూ నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కొత్త విధానంలో భాగంగా శ్రీవాణి దర్శనం టికెట్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం వేళలు మారనున్నాయి. ఈ విషయాన్ని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. శ్రీవాణి దర్శనాలపై టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


శ్రీవాణి దర్శనం టికెట్లను ప్రస్తుతం ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లోనూ టీటీడీ జారీ చేస్తోంది. అయితే ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కారణంగా శ్రీవాణి దర్శనం టికెట్లు ఆఫ్‌‍లైన్‌లో పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ఏరోజుకు ఆ రోజు శ్రీవాణి దర్శనం టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఏఈవో తెలిపారు. శ్రీవాణి టికెట్లు జారీచేసిన రోజే శ్రీవారి దర్శనం కల్పించాలని.. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఆగస్ట్ 15 వరకూ ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.


ఇక శ్రీవాణి దర్శనం టికెట్లను తిరుమలలో ఉదయం పది గంటల నుంచి జారీ చేస్తారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన శ్రీవాణి దర్శనం టికెట్లు జారీ చేస్తారు. అలాగే రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఉద‌యం 7 నుంచి దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకూ వీటిని జారీ చేస్తారు. ఆఫ్‌లైన్‌ శ్రీవాణి దర్శనం టికెట్లు రోజూ వేయి వరకూ అందుబాటులో ఉంటాయి. అందులో తిరుమ‌ల‌లో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట ఎయిర్‌పోర్టులో 200 టికెట్లు జారీ చేస్తారు. శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు తిరుమ‌ల‌లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వ‌ద్ద అదే రోజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.


మరోవైపు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే ఆక్టోబ‌ర్ 31 వరకూ ఆన్ లైన్‌లో శ్రీ‌వాణి టికెట్లను పొందిన భ‌క్తుల‌ు య‌థావిధిగా ఉద‌యం 10 గంట‌ల‌కే దర్శనానికి అనుమతిస్తారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి శ్రీవాణి దర్శనం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ టికెట్లు పొందిన వారిని సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులు ఉదయం 10 గంటలకు మాత్రమే శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం వద్దకు రావాలని టీటీడీ కోరింది. కొత్త విధానంతో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు ఆ రోజునే శ్రీవారిని దర్శించుకునేందుకు వీలు అవుతుందని టీటీడీ చెప్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa