ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకేసారి ముగ్గురు అన్నదమ్ములకు ప్రభుత్వ ఉద్యోగాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 07:44 PM

ప్రభుత్వ ఉద్యోగం.. లక్షలాదిమంది యువత కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించే యువత ఎందరో.. సర్కారీ కొలువే ధ్యేయంగా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు లక్షల్లో ఉంటారు. ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ల మీద ఆశతో.. రేపటి మీద నమ్మకంతో పట్టువదలక పరీక్షలకు ప్రిపేరయ్యేవారు వేలల్లో ఉంటారు. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు.. తమ జీవితాలు, తమ కుటుంబం తలరాతలు మారిపోతాయనే నమ్మకంతో పరీక్షలకు సన్నద్ధమవుతూ ఉంటారు. అలాంటిది ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అది కూడా ఒకేసారి ముగ్గురికి గవర్నమెంట్ కొలువులు వస్తే ఆ కుటుంబం ఆనందం .. ఆ కన్నవారి సంతోషం ఎంతలా ఉంటుందో మాటల్లో చెప్పలేం.. అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది.


ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలలో ఆసక్తికరమైన, అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని కానిస్టేబుల్ ఉద్యోగం వరించింది. ఈ అరుదైన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ముగ్గురు అన్నదమ్ములను కానిస్టేబుల్ ఉద్యోగాలు వరించాయి. గుత్తికి చెందిన మహమ్మద్ అలీ, మహమ్మద్ గౌస్, మహమ్మద్ సమీర్‌ అనే ముగ్గురు సోదరులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెళ్లివిరుస్తోంది. మరోవైపు ఈ సోదరుల తండ్రి కూడా పోలీస్ శాఖలో పనిచేస్తుండటం మరో విశేషం. వీరి తండ్రి మహబూబ్ దౌలా.. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన ముగ్గురు కొడుకులకు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు రావటంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.


మరోవైపు 6,100 కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీ తుది ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుళ్ల ఫలితాలను విడుదల చేశారు. ఏపీ కానిస్టేబుల్స్ ఫలితాలలో గండి నానాజి 168 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే 159 మార్కులతో జి.రమ్య మాధురి రెండో స్థానంలో నిలిచారు. 144.5 మార్కులతో మెరుగు అచ్యుతారావు అనే అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ ఆర్కే మీనా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa