ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ దేశాలపై ట్రంప్ మరో బిగ్ బాంబ్.. ఈసారి ఏకంగా 70 దేశాలకు టారిఫ్‌ల పెంపు

international |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 09:46 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అనేక దేశాలపై విరుచుకుపడ్డారు. ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే సంచలన నిర్ణయం తీసుకుంటూ.. కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ముఖ్యంగా భారత్‌తో సహా ప్రపంచంలోని డజన్ల కొద్దీ దేశాల ఎగుమతులపై కొత్త "రెసిప్రోకల్ టారిఫ్‌లు" విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు 10 శాతం నుంచి 41 శాతం వరకు ఉంటాయని.. దేశాల వారీగా, వస్తువుల వారీగా ఈ రేట్లు మారుతాయని వెల్లడించారు. అమెరికా వర్తక లోటును తగ్గించుకునేందుకు అత్యవసర అధికారాలను ఉపయోగించి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు.


ఈ కొత్త టారిఫ్‌ల ప్రకారం భారత్ నుంచి వచ్చే వస్తువులపై 25 శాతం సుంకం విధించారు. అదేవిధంగా సిరియా నుంచి వచ్చే వాటిపై అత్యధికంగా 41 శాతం, తైవాన్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 20 శాతం, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే వాటిపై 30 శాతం సుంకం అమలులోకి వస్తుందని ప్రకటించారు. దీనికి అదనంగా బ్రెజిల్ వంటి కొన్ని దేశాలపై ఇప్పటికే ఉన్న సుంకాలతో పాటుగా ఈ కొత్త టారిఫ్‌లు కూడా వర్తిస్తాయని ఆర్డర్‌లో పేర్కొన్నారు. మొత్తంగా 70 దేశాలపై ఈ సుంకాల పెంపు ఉండగా.. ఇవన్నీ మరో ఏడు రోజుల్లోనే అమల్లోకి రానున్నాయి. అయితే భారత్, కెనడా దిగుమతులపై విధించిన టారిఫ్‌లు మాత్రం ఆగస్టు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు ఇప్పటికే స్పష్టం చేశారు.


ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాలలో ఆందోళన కలిగించింది. ఇవి కేవలం భారత్, తైవాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆఫ్ఘనిస్తాన్‌కు 15 శాతం, అల్జీరియాకు 30 శాతం, కజకిస్తాన్‌కు 25 శాతం ఇలా డజన్ల కొద్దీ దేశాలపై ప్రభావం చూపుతుంది. వాణిజ్య లోటు అంటే ఒక దేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం. అమెరికా తన దిగుమతులను తగ్గించి, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ట్రంప్ వర్గాలు పేర్కొంటున్నాయి.


అమెరికా వంటి అగ్రరాజ్యం ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని అనేక దేశాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. ఈ చర్యల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ సుంకాలు గణనీయమైన సవాళ్లను సృష్టించగలవని వివరిస్తున్నారు. ఈ నిర్ణయంపై ఆయా దేశాలు ఎలా స్పందిస్తాయో, అలాగే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య చర్చలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa