ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేవలం రూపాయికే వీసా, ఆ 15 దేశాలకు వెళ్లొచ్చు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 08:08 PM

విదేశీ ట్రిప్‌లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న భారతీయులకు.. టెక్నాలజీ ఆధారిత వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అట్లీస్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా కేవలం రూపాయికే వారికి వీసా అందిస్తామని వెల్లడించింది. 'అట్లీస్ వన్ వే అవుట్' అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ వీసా సేల్‌లో భారతీయులకు 15కు పైగా దేశాలకు.. కేవలం రూపాయికే వీసా లభించనుంది. అయితే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ఆగస్టు 4, 5 తేదీల్లో మాత్రమే అట్లీస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆఫర్‌ను వినియోగించుకోండి.


వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫాం అట్లీస్ 2021లో ప్రారంభం కాగా.. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో మెహక్ నహ్తా దీన్ని స్థాపించారు. ఈ సంస్థ ఇప్పుడు వన్ వే అవుట్ పేరిట.. మొత్తంగా 15 దేశాలకు రూపాయికే వీసా అందిస్తోంది. ఈ పదిహేను దేశాలు మరేవో కావు.. యూఏఈ, యూకే, వియత్నాం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, హాంకాంగ్, జార్జియా, ఒమన్, మొరాకో, ఖతర్, కెన్యా, తైవాన్‌లు. ఈ దేశాల్లో ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. భారతీయులకు రూపాయికే వీసా ఆఫర్ అందుబాటులో ఉంచింది. అలాగే మీరు అట్లీస్ ద్వారా వీసా బుక్ చేసుకుంటే.. గ్రీస్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి ఎంపిక చేసిన షెంజెన్ దేశాల విషయంలో సేవా రుసువు, అపాయింట్‌మెంట్ ఫీజు రెండూ ఉండవు.


అయితే ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎలాంటి మార్పులు ఉండవని అట్లీస్ సంస్థ తెలిపింది. అయితే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయగానే.. ఈ ఆఫర్ దానంతట అదే వర్తిస్తుంది. ప్రాసెసింగ్ కేంద్రం వద్ద మాత్రం కాన్సులేట్, బయోమెట్రిక్ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్యాంపెయిన్‌లో అవి భాగం కావని.. ఇక చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు ఉండి.. ఒక వీసా వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆగస్టు 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 5వ తేదీ రాత్రి 12 గంటలకు వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులు కూడా తోడు అయితే వారికి సాధారణ ఛార్జీలే ఉంటాయి. అలాగే మీరు వెళ్తున్న దేశాన్ని బట్టి ఆయా ఎంబసీలు విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంద. లేకపోతే వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.


ఈ కార్యక్రమం యువతను ముఖ్యంగా మొదటిసారి విదేశాలకు వెళ్లేవారిని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. గత 60 రోజుల్లో అట్లీస్ ప్లాట్‌ఫామ్‌పై వియత్నాం, ఇండోనేషియా, జార్జియా, యూకే, యూఏఈ వంటి దేశాల కోసం శోధనలు 18 శాతం నుంచి 44 శాతం వరకు గణనీయంగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది. ఈ పెరుగుదల ఎక్కువగా టైర్ 1, టైర్ 2 నగరాల నుంచి, ముఖ్యంగా జెన్ Z, మిలీనియల్స్ నుంచి వస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ గణాంకాలు అంతర్జాతీయ ప్రయాణాలపై పెరుగుతున్న ఆసక్తిని, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ గుర్తించిన సంస్థ ఈ ఆఫర్ ప్రకటించినట్లు వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa