ట్రెండింగ్
Epaper    English    தமிழ்

65 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు,,,ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 08:18 PM

భారత ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. సుమారు 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు తెలిపింది. ఇంతకు ఇది ఎక్కడ జరిగిందంటే.. బిహార్ రాష్ట్రంలో. త్వరలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేసింది. దీనిలో ఏకంగా 65.2 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.


బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల కమిషన్ .. ఓటర్ల జాబితాలోని తప్పులను సరి చేయడం కోసం నెల రోజుల పాటు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)) కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం నాడు అనగా ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఇప్పుడిది రాజకీయ ప్రకంపనలు రేకెత్తిస్తుంది.


బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమం ఓటర్ల జాబితాను సంపూర్ణంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దడం, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను అప్‌డేట్ చేయడం, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడం వంటి పనులు చేప్టింది. రాష్ట్రంలో నమోదైన 7.89 కోట్ల మంది ఓటర్లలో 91.69 శాతం మంది అంటే.. సుమారుగా 7.24 కోట్ల మంది తమ ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.


ఎస్ఐఆర్ కార్యక్రమం తర్వాత విడుదలైన ముసాయిదా జాబితా ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65.2 లక్షల మంది ఓటర్ల పేర్లను వివిధ కారణాలతో తొలగించారు. వీరిలో చనిపోయిన వారు, వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు పొందిన వారు ఉన్నారని.. వారందరి ఓట్లను తొలగించినట్లుగా భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది.


ఈ మూసాయిదా జాబితాపై ఓటర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1 వరకు గడువిచ్చింది. అలానే అర్హత కలిగిన ఓటర్ల పేర్లు.. ఓటర్ జాబితాలో లేకపోతే.. వారి పేర్లను తిరిగి చేర్చడానికి అవకాశం కల్పించింది. ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసేందుకు.. అర్హతలేని ఎంట్రీలను తొలగించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.


2024 జూలై 1 నాటికి లేదా అంతకన్నా ముందే 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లు, అలాగే 2024 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ఫారమ్ 6, డిక్లరేషన్ ఫారమ్ ఉపయోగించి ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని తెలిపింది. అన్ని అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత.. సెప్టెంబర్ 30న ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను తుది ప్రచురిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa