ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటరు జాబితాలో నా పేరే లేదు, నేనెలా పోటీ చేయాలి..: తేజస్వీ యాదవ్

national |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 09:17 PM

రాబోయే బీహార్ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వీ యాదవ్ చేసిన సంచలన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన బిహార్ ఓటర్ల జాబితా ముసాయిదాలో తన పేరు లేదని ఆరోపించారు. తన ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నంబర్‌తో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో తనిఖీ చేశానని చెప్పారు. దానిలో ఎక్కడా తన పేరు కనిపించలేదని వాపోయారు. ఇలాగైతే తాను ఎన్నికల్లో పోటీ ఎలా చేయాలని ప్రశ్నించారు. తేజస్వీ యాదవ్ చేసిన ఈ ఆరోపణలను ఈసీ వెంటనే ఖండించింది. అంతటితో ఆగకుండా.. ఆయన పేరు ఓటర్ల జాబితాలో ఉన్నట్లు ఆధారాలు చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చింది.


తేజస్వీ యాదవ్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. పెద్ద స్క్రీన్‌పై తన ఫోన్‌ను కనెక్ట్ చేసి ఓటర్ల జాబితాలో తన పేరు కోసం వెతికే ప్రయత్నం చేశారు. తన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేసినప్పుడు ఆయన పేరుతో ఎలాంటి గుర్తింపు కార్డు కనిపించలేదు. నో రికార్డ్స్ ఫౌండ్ అనే సందేశం వచ్చిందిని తేజస్వీ యాదవ్ మీడియాకు వివరించారు. నేరుగా బూత్ స్థాయి అధికారి తన వద్దకు వచ్చి దరఖాస్తు స్వీకరించారని అన్నారు. అయినా తన పేరు ఓటరు జాబితాలో కనిపించడం లేదని పేర్కొన్నారు. ప్రత్యేక ముమ్మర సవరణ తో రాష్ట్రంలో దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని వెల్లడించారు.


అయినా తనలాంటి ప్రముఖుడికే ఇలాంటి సమస్యలు ఎదురైతే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఓటరు ఐడీ కార్డే లేకుండా తానిప్పుడు ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలంటూ నేరుగా ఈసీని ప్రశ్నించారు. వెంటనే సమాధానం చెప్పాలని కూడా కోరారు. అయితే ఎన్నికల సంఘం కూడా వెంటనే తేజస్వీ కామెంట్లపై స్పందించింది. ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టి పారేసింది. ముసాయిదా జాబితాలో 416 క్రమ సంఖ్య వద్ద తేజస్వీ పేరు ఉందని స్పష్టం చేసింది. ఆయన చెబుతున్న కార్డు ఫోర్జరీదా అనేది దర్యాప్తు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది.


ముఖ్యంగా ఈసీ వర్గాలు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితాలు ఒక మూలమని, బీహార్‌లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు అభ్యంతరాలు, అభ్యంతరాలు సమర్పించడానికి గడువు ఉందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీ నుంచి, ఆర్జేడీ నుంచి కూడా గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఈసీ స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa