ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోని జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తోంది. మహారాష్ట్ర తర్వాత దేశంలో జాతీయ రహదారుల విస్తరణ పనులు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం ఏపీనే కావటం విశేషం. ఇదే క్రమంలో రాష్ట్ర రహదారులపైనా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రహదారులకు మంచిరోజులు వచ్చాయి. ఆర్అండ్బీ శాఖ పరిధిలో ఉన్న రోడ్లకు మహర్దశ పట్టనుంది. వాహనాల రద్దీ అధికంగా ఉండే రహదారులను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు. ఎన్డీబీ కింద వీటిని అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు. ఎన్డీబీ నుంచి నిధులు కూడా మంజూరు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లింపులో జాప్యం జరగటంతో పనులు జరగలేదు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాహనాల రద్దీ అధికంగా ఉన్న రోడ్లను హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) విధానంలో అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట నియోజకవర్గాలలోని కొన్ని రహదారులను ఇందుకోసం ఎంపిక చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే.. రహదారుల నిర్మాణానికి కావాల్సిన నిధులలో 40 శాతం డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
మిగతా 60 శాతం నిధులను కాంట్రాక్టర్కు బ్యాంక్ నుంచి రుణం రూపంలో ఇప్పిస్తుంది. ఈ నిధులతో కాంట్రాక్టర్ రోడ్లను అభివృద్ధి చేస్తారు. ఆ తర్వాత బ్యాంక్ నుంచి కాంట్రాక్టర్కు అందించిన రుణాన్ని ప్రభుత్వం 15 ఏళ్లల్లో విడత వారీగా బ్యాంకులకు చెల్లిస్తుంది. ఈ 15 ఏళ్లు కూడా కాంట్రాక్టర్ తాను వేసిన రోడ్ల నిర్వహణ, ఇతరత్రా పనులు చూడాల్సి ఉంటుంది.
మరోవైపు సూళ్లూరుపేట- శ్రీకాళహస్తి రహదారిని పెరిమిటిపాడు నుంచి బుచ్చినాయుడుకండ్రిగ వరకూ విస్తరించనున్నారు. 22 కోట్ల రూపాయలతో ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అలాగే బైరాజుకండ్రిగ - రామాపురం రోడ్డును ఆరుకోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నారు.
వేడేం-రామాపురం-ముసలిపేడు రోడ్డును రూ.14 కోట్లతో, నాగలాపురం-చిన్నపాండూరు రహదారిని రూ.45 కోట్లతో అభివృద్ధి చేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు మొదలెట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa