ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు రూ. 30,000 జరిమానా విధించిన మద్రాసు హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 09:50 PM

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో పదేపదే జాప్యం చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీరుపై మద్రాసు హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈడీకి రూ. 30,000 జరిమానా విధిస్తూ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మరింత గడువు కావాలంటే జరిమానా చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.సినీ నిర్మాత ఆకాశ్ భాస్కరన్, వ్యాపారవేత్త విక్రమ్ రవీంద్రన్‌లకు చెందిన నివాస, కార్యాలయ ప్రాంగణాల్లో ఈడీ సోదాలు నిర్వహించి, వాటిని సీల్ చేసింది. తాము లేనప్పుడు, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ చర్యలు చేపట్టారని ఆరోపిస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీ పలుమార్లు గడువు కోరింది.జస్టిస్ ఎం.ఎస్. రమేశ్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. గతంలోనే 'చివరి అవకాశం'గా గడువు ఇచ్చామని ఈ సందర్భంగా కోర్టు గుర్తుచేసింది. అయినప్పటికీ, ఈడీ ప్రత్యేక ప్రాసిక్యూటర్ ఎన్. రమేశ్ మరోసారి గడువు పొడిగించాలని కోరారు. అధికారుల బదిలీల కారణంగా కేసును కొత్త అధికారులు స్వీకరించారని, సమగ్రమైన కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని విన్నవించారు.దీనిపై స్పందించిన ధర్మాసనం, జరిమానాతో కూడిన షరతుపై మాత్రమే గడువు ఇస్తామని స్పష్టం చేసింది. ఒక్కో పిటిషన్‌కు రూ. 10,000 చొప్పున మొత్తం మూడు పిటిషన్లకు కలిపి రూ. 30,000 జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే కౌంటర్ దాఖలు చేయాలని తేల్చిచెప్పింది. కౌంటర్లు వేసేందుకు ఈడీకి రెండు వారాల సమయం మంజూరు చేసింది.తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్  అవినీతి కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. టాస్మాక్ ఎండీ మొబైల్ ఫోన్‌లో తమ ఫోన్ నంబర్లు సేవ్ చేసి ఉండటమే ఏకైక కారణంగా ఈడీ చూపిస్తోందని తెలిపారు. ఆయనతో ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగానీ, వాట్సాప్ సందేశాలు పంపినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. గతంలో ఈ కేసును విచారించిన కోర్టు, ఈడీ సమర్పించిన ఆధారాలను పరిశీలించి సోదాలకు అధికారం ఇచ్చిన నేపథ్యంలో పరిధిని మీరినట్లు ఉందని వ్యాఖ్యానించింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా ఎలాంటి బలమైన సమాచారం లేదని పేర్కొంటూ ఈడీ చర్యలపై స్టే విధించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa