ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిట్‌మ్యాన్ నాయకత్వంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు

sports |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 06:33 PM

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మనే కొనసాగించాలని సూచించాడు. వన్డేల్లో రోహిత్ నాయకత్వంలో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోందని, అతడికి మరో ప్రపంచకప్ గెలిపించే సత్తా ఉందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు.ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన అంబటి రాయుడు, రోహిత్ కెప్టెన్సీపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించాడు. "2027 ప్రపంచకప్‌ వరకు భారత జట్టుకు రోహితే సారథ్యం వహించాలి. వన్డే ఫార్మాట్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ప్రస్తుతానికి లేడు. అందుకే రోహిత్ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుని జట్టును ముందుకు నడిపించాలి" అని రాయుడు పేర్కొన్నాడు.రోహిత్ సారథ్యంలోనే ఇటీవలే భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయాన్ని రాయుడు గుర్తుచేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ 76 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడని ప్రశంసించాడు. రోహిత్ నాయకత్వం, బ్యాటింగ్ సామర్థ్యం భారత జట్టుకు ఎంతో కీలకమని అన్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు 273 వన్డేలు ఆడి 32 సెంచరీలతో 11,168 పరుగులు సాధించాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa