అత్యవసర సమయంలో అందరికీ ఠక్కున గుర్తొచ్చేది 108. రోడ్డు ప్రమాదమైనా, ప్రసవమైనా.. ఇంకా ఏదైనా అత్యవసర పరిస్థితి అయినా సకాలంలో అక్కడకు చేరుకుని వీలైనంత త్వరగా ఆస్పత్రులకు చేరవేస్తూ పేదల పాలిట సంజీవనిగా 108 అంబులెన్సులు నిలుస్తున్నాయి. అలాగే ఆక్సిజన్ ట్యాంకర్ లు కూడా.. కరోనా సమయం అప్పటి నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ల విలువేంటో ప్రజలకు తెలిసివచ్చింది. అటు అంబులెన్స్, ఇటు ఆక్సిజన్ ట్యాంకర్.. రెండూ ఒకేసారి ట్రాఫిక్లో చిక్కుకుపోయిన ఘటన తిరుపతి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా రేణిగుంట చెక్పోస్ట్ కూడలి సమీపంలో ఓ రైల్వే బ్రిడ్జి ఉంటుంది. ఈ రైల్వే బ్రిడ్జి పై నుంచి రైళ్లు వెళ్తుంటే.. కింద నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రేణిగుంట రైల్వే జంక్షన్ కావటం.. తిరుపతికి సమీపంలో ఉండటంతో ఈ రహదారి మీద వాహనాల రాకపోకలు ఎక్కువగానే ఉంటాయి.
అయితే మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఓ ఆక్సిజన్ ట్యాంకర్ రైల్వే బ్రిడ్జి కింద నుంచి వెళ్తూ చిక్కుకుపోయింది. ట్యాంకర్ పరిణామం ఎక్కువగా ఉండటంతో అటు ముందుకు వెళ్లలేక.. ఇటు బయటకు రాలేక రైల్వే బ్రిడ్జి కింద చిక్కుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీగా వాహనాలు బారులు తీరాయి. ఇదే సమయంలో అటుగా అంబులెన్స్ రావటంతో.. అది కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయిన పరిస్థితి. అయితేఈ విషయం గురించి సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. అయితే అప్పటి వరకూ అటు వాహనదారులు.. ఇటు అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు రేణిగుంట వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జిని విస్తరించాలని వాహనదారులు కోరుతున్నారు. లారీలు, ట్రక్కులు వంటి వాహనాలు చిక్కుకుపోయే ప్రమాదం ఉందని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రైల్వే బ్రిడ్జిని విస్తరించాలని కోరుతున్నారు. రైళ్లు కింద వైపున.. పై నుంచి వాహనాలు వెళ్లేలా బ్రిడ్జి నిర్మాణం చేయాలంటున్నారు. రేణిగుంట రైల్వే జంక్షన్ కావటంతో ఈ స్టేషన్ మీదుగా నిత్యం భారీ సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే రేణిగుంటలో ఎయిర్పోర్టు ఉండటంతో.. రేణిగుంటకు వచ్చీపోయే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa