టాలీవుడ్ యంగ్ కపుల్ నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల గురువారం ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కెరీర్ లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, నాగచైతన్య తన అర్ధాంగితో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు విచ్చేశారు. వీరి పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న చైతన్య, శోభిత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగచైతన్య సంప్రదాయ పట్టు పంచెలో కనిపించగా, శోభిత ఎరుపు, బంగారు వర్ణం కలగలిపిన పట్టు చీరలో ఆకట్టుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఈ జంటకు స్వామివారి ప్రతిమను బహూకరించారు. ఈ సమయంలో వారు నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు.ఆలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో అభిమానులు, మీడియా ప్రతినిధుల రద్దీ మధ్య నాగచైతన్య తన భార్య శోభిత చేతిని పట్టుకుని జాగ్రత్తగా ముందుకు నడిపించారు. ఆమె పట్ల చైతన్య చూపిన ఈ ఆప్యాయత అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో, అభిమానులు వీరిని 'అద్భుత జంట' అంటూ ప్రశంసిస్తున్నారు.కొంతకాలంగా ప్రేమలో ఉన్న నాగచైతన్య, శోభిత గత ఏడాది ఆగస్టులో హైదరాబాద్లో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం డిసెంబర్లో అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. 2021లో సమంతతో విడిపోయిన తర్వాత, 2022 నుంచి చైతూ, శోభిత మధ్య ప్రేమాయణంపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa