ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల వివాదాస్పద వ్యవహారాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేలను నియంత్రించే బాధ్యతను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగిస్తూ, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. రేపు (శనివారం) జరగనున్న కీలక సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిట్బ్యూరో సభ్యులతో పార్టీ సంస్థాగత నిర్మాణం, పాలనా అంశాలపై చర్చించనున్నారు.
ఈ సమావేశంలో 25 లోక్సభ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను ఖరారు చేయనున్నారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తలు స్థానిక నేతలు, ఎమ్మెల్యేలతో చర్చించి ముగ్గురి పేర్లను సిఫారసు చేస్తారు. వీరిలో ఒకరిని పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమిస్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ కమిటీల ఏర్పాటును వేగవంతం చేయాలని చంద్రబాబు సూచించనున్నారు.
సెప్టెంబర్ 3న అనంతపురంలో ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభను మొదట ఈ నెల 25న నిర్వహించాలనుకున్నా, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఢిల్లీ పర్యటన కారణంగా వాయిదా వేశారు. స్త్రీశక్తి పథకం విజయవంతంపై జిల్లాల్లో సమావేశాల ఏర్పాటుపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.
ఎమ్మెల్యేల తప్పిదాలపై చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు వారి వ్యవహార శైలిని పర్యవేక్షించే బాధ్యత అప్పగించారు. రేపటి సమావేశంలో ఈ అంశంపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు, పాలనలో పారదర్శకత, బాధ్యతలను నెరవేర్చేందుకు చంద్రబాబు తీసుకుంటున్న ఈ చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa