ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆ మూడు ప్రాంతాల్లో.. కొత్త క్రికెట్ స్టేడియాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 07:42 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు పడింది. రాష్ట్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. అమరావతిలో నిర్మించే క్రికెట్ స్టేడియం దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియాలలో ఒకటిగా నిలవనుంది. ఆ దిశగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా అమరావతిలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి 40 ఎకరాల భూమి కేటాయించాలని ఏసీఏ ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.


అమరావతిలో నిర్మించే క్రికెట్ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని.. దేశంలోని అత్యుత్తమ క్రికెట్ మైదానాలలో ఒకటిగా తీర్చిదిద్ది, ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేలా చూస్తామని ఏసీఏ సెక్రటరీ, ఎంపీ సానా సతీష్ వెల్లడించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించడానికి కనీసం రూ.300 కోట్లు అవసరం అవుతుందని సానా సతీష్ అంచనా వేశారు.


అమరావతి క్రికెట్ స్టేడియంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో క్రికెట్ స్టేడియాలు నిర్మించనున్నట్లు ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ వివరించారు. ప్రస్తుతం మంగళగిరి, మూలపాడు (విజయవాడ), విజయనగరం, విశాఖపట్నం, అనంతపురంలో క్రికెట్ స్టేడియాలు ఉన్నట్లు ఆయన వివరించారు. తొలి విడతలో తిరుపతి, నెల్లూరు, కర్నూలులో పెద్ద స్టేడియాలు నిర్మించనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ఈ మూడు చోట్ల ఇప్పటికే భూ సేకరణ పూర్తైందని వివరించారు. వచ్చే మూడేళ్లల్లోగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రికెట్ మైదానాలను అభివృద్ధి చేస్తామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ వెల్లడించారు.


మరోవైపు అమరావతి క్రికెట్ స్టేడియాన్ని.. మల్టీ ఈవెంట్ స్టేడియంగా తీర్చిదిద్దనున్నట్లు సానా సతీష్ వెల్లడించారు. 60 వేల సీట్ల సామర్థ్యంతో దీనిని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. విశాఖపట్నం క్రికెట్ స్టేడియం 17 ఏళ్ల నాటిదని.. అందులో కనీస సౌకర్యాలు కూడా దెబ్బతింటే.. మూడు నెలల్లో మరమ్మత్తులు చేసినట్లు గుర్తు చేశారు. మరోవైపు విజయనగరం, అనంతపురం, మూలపాడులో అకాడమీలు నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ప్రతి అకాడమీలోనూ 40 నుంచి 50 మంది ప్లేయర్లకు ట్రైనింగ్ ఇచ్చేలా సౌకర్యాలు, ట్రైనర్లు, కోచ్‌లు, ఫిజియోలను అందుబాటులో ఉంచుతామని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa