శుక్రవారం పార్లమెంటు భవనం వద్ద భద్రతా ఉల్లంఘన ఘటన చోటు చేసుకుంది. ఆగంతకుడు ఒకరు శుక్రవారం నాడు.. పార్లమెంటు భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఒక వ్యక్తి గోడ దూకి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలపారు. అయితే పార్లమెంటు భవనం ఆవరణలో ఉన్న భద్రతా దళాలు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆగంతకుడు శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో చెట్టు సహాయంతో గోడ ఎక్కి పార్లమెంటులోకి ప్రవేశించాడని భద్రతా వర్గాల సమాచారం. అతను రైల్ భవన్ వైపు నుండి గోడ దూకి కొత్త పార్లమెంటు భవనం గరుడ్ గేట్ వరకు చేరుకున్నాడు. అయితే పార్లమెంట్ లోపల ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజు ఈ సంఘటన వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమై ఆగస్టు 21న ముగిశాయి. 32 రోజుల వ్యవధిలో మొత్తం 21 సెషన్లు జరిగాయి.
గత సంవత్సరం ఆగస్టులో కూడా ఇలాంటి భద్రతా ఉల్లంఘన సంఘటన జరిగింది. 20 ఏళ్ల ఒక వ్యక్తి గోడ దూకి పార్లమెంటు అనుబంధ ప్రాంగణంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే చోటు చేసుకోవడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఢిల్లీ పోలీసులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ వ్యక్తి ఎవరు.. ఎందుకు రహస్యంగా పార్లమెంట్ గోడ ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు.. ఏదైనా కుట్రలో భాగంగా ఇలాంటి పని చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.
పార్లమెంట్లోకి ఇలా అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించడం ఇది రెండో సారి. దాదాపు రెండేళ్ల క్రితం ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. రెండు సంవత్సరాల క్రితం అనగా 2023 డిసెంబర్ 13న, ఇద్దరు వ్యక్తులు లోక్సభ ఛాంబర్లోకి దూకిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2001 పార్లమెంట్ మీద ఉగ్రదాడి జరిగి 22 సంవత్సరాలు పూర్తైన రోజునే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa