ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసుపత్రి నిర్మాణ కుంభకోణం: మాజీ మంత్రి నివాసంపై ఈడీ దాడులు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 05:43 PM

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆసుపత్రి నిర్మాణ కుంభకోణానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం రోజు ఉదయం సోదాలు నిర్వహించింది. మాజీ మంత్రి నివాసం సహా మొత్తంగా 13 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఈ ఏడాది జూన్ ప్రారంభంలో ఆసుపత్రి నిర్మాణ ప్రాజెక్టుల్లో జాప్యానికి సబంధించిన కుంభకోణంలో ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రులు సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్‌లపై అవినీతి నిరోధక చట్టం కింద ఏసీబీ దర్యాప్తు నిర్వహించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈక్రమంలోనే ఈడీ దాడులు చేసింది.


గతేడాది ఆగస్టు నెలలో బీజేపీకి చెందిన విజేందర్ గుప్తా చేసిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ ప్రారంభం అయింది. అప్పటి ఆరోగ్య మంత్రులు భరద్వాజ్, సత్యేంద్ర జైన్‌ల సహకారంతోనే ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖలో అవినీతి జరిగిందని గుప్తా ఆరోపించారు. ఈక్రమంలోనే మే 6వ తేదీన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఈ విచారణకు సిఫార్సు చేయగా.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అలా ఢిల్లీ ఆసుపత్రుల నిర్మాణ కుంభకోణంలో మాజీ ఆరోగ్య మంత్రులు సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్‌లపై విచారణకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అధికారం లభించింది.


ఈ ప్రాజెక్టులో జరిగిన ఆర్థిక అక్రమాలను ఏసీబీ ప్రాథమిక విచారణలోనే గుర్తించింది. ముఖ్యంగా ప్రాజెక్టు వ్యయం పెరగడం, నిర్మాణ పనులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, నిధులను దుర్వినియోగం చేయడం వంటివి జరిగినట్లు తెలిపింది. ఈ చర్యలు ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించాయని పేర్కొంది. అయితే ఆప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రాజెక్టు ఆలస్యం కావడం అనేది సాధారణ ప్రక్రియ అని.. దానిని అవినీతికి ఆయుధంగా వాడుకుంటున్నారని ఆప్ ఆరోపించింది. ముఖ్యంగా సౌరభ్ భరద్వాజ్ ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. ఈ చర్య పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, బీజేపీ కేంద్ర ఏజెన్సీలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.


అయితే ఈ దాడుల వెనుక పటిష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఆసుపత్రుల నిర్మాణంలో జరిగిన అక్రమాలను వెలికితీయడమే తమ లక్ష్యమని ఈడీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సౌరభ్ భరద్వాజ్ ఇంటితో పాటు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ఇతరుల కార్యాలయాలు, నివాసాలపై కూడా ఈడీ తాజాగా తనిఖీలు చేసింది. మొత్తంగా 13 ప్రాంతాల్లో సోదాలు చేయగా.. కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సాక్ష్యాల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తును వేగవంతం చేయాలని ఈడీ నిర్ణయించింది.


మరోవైపు ఈ కుంభకోణంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఆరోగ్య సేవలను కూడా వ్యాపారంగా మార్చి ప్రజల సొమ్మును దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడులు ఆప్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని బట్టబయలు చేశాయని, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే ఆప్ నాయకులు ఇప్పుడు తామే అవినీతికి పాల్పడ్డారని రుజువైందని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa