తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. విజయవాడలోని సితార సెంటర్లో డూండీ గణేశ్ సేవాసమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ 'కార్యసిద్ధి మహాశక్తి గణపతి'ని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. "తెలుగువారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ గణనాథుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు రాకుండా ముందుకు సాగాలని ప్రార్థించాను" అని పేర్కొన్నారు.అనంతరం రాష్ట్రంలోని జలవనరుల నిర్వహణ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. "గతంలో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన బుడమేరు వరదలు మళ్లీ రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది గోదావరి నుంచి సుమారు 1500 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్లినప్పటికీ, రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలా కళకళలాడుతున్నాయి" అని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి వెంట పలువురు స్థానిక నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa