ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీనేనన్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 28, 2025, 06:16 AM

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీయేనని, పింఛన్ల పథకాన్ని ప్రవేశపెట్టింది, దాన్ని దశలవారీగా పెంచుతూ వస్తున్నది కూడా తమ ప్రభుత్వాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పింఛన్ల విషయంలో విమర్శలు చేస్తున్న వైసీపీకి కనీసం మాట్లాడే అర్హత కూడా లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాట్లాడ్డానికే అర్హత లేని పార్టీ తమను విమర్శిస్తోందని మండిపడ్డారు. బుధవారం నాడు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన పునరుద్ఘాటించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "సామాజిక భద్రతా పింఛన్లను రూ. 30 నుంచి ప్రారంభించి, నేడు రూ. 4000కు పెంచిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. కేవలం వృద్ధాప్య పింఛన్లనే తీసుకుంటే, మేం పెంచిన మొత్తమే రూ. 2875 ఉంటుంది. దివ్యాంగుల విషయంలో గత ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు. వారి పింఛనును రూ. 500 నుంచి ఏకంగా రూ. 6000కు పెంచింది మా ప్రభుత్వమే. అలాగే డయాలసిస్ రోగులకు రూ. 10 వేలు, మంచానికే పరిమితమై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రూ. 15 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు అందిస్తున్నాం. దీనికోసం ఏటా సుమారు రూ. 35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం" అని వివరించారు. ప్రజలకు ఇంత మేలు చేస్తున్నప్పుడు, ఈ వాస్తవాలను ప్రతి ఒక్కరికీ వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.వైసీపీ కేవలం అబద్ధాల పునాదులపైనే రాజకీయం చేస్తుందని, వారు చేసిన తప్పులను ఇతరులపైకి నెట్టడంలో దిట్టలని చంద్రబాబు విమర్శించారు. "గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారు. దీనివల్ల నిజమైన అర్హులకు నష్టం జరుగుతోంది. అందుకే ఇప్పుడు అనర్హులను తొలగించి, ప్రతి అర్హుడికీ న్యాయం చేయాలని సంకల్పించాం. ఈ ప్రక్రియలో అధికార యంత్రాంగం ఏమైనా పొరపాట్లు చేస్తే, వాటిని గుర్తించి సరిదిద్దే బాధ్యతను పార్టీ యంత్రాంగం తీసుకోవాలి. ప్రభుత్వపరంగా నేను విధానాలు అమలు చేస్తాను, పార్టీ అధినేతగా మీ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని లోపాలను సరిదిద్దుతాను. తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్నవారికి కూడా నోటీసులతో సంబంధం లేకుండా పింఛన్లు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ఏ ఒక్క అర్హుడూ నష్టపోకూడదన్నదే మా లక్ష్యం" అని ఆయన భరోసా ఇచ్చారు.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికీ చేరవేసినట్లే, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. "చెప్పిన మాట ప్రకారం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించాం. ఎంతమంది పిల్లలున్నా ప్రతి తల్లికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తున్నాం. అన్న క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ పథకాలను పునరుద్ధరించాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. చేనేతలకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, మత్స్యకారులకు వేట విరామ భృతిని రూ. 20 వేలకు పెంచాం. వీటన్నింటినీ ప్రజలకు వివరించాలి. సెప్టెంబర్ 6న అనంతపురంలో 'సూపర్-6 సూపర్ హిట్' పేరుతో భారీ సభ నిర్వహిస్తున్నాం" అని చంద్రబాబు తెలిపారు. గతంలో గొడవలు, దాడులతో ఉన్న వాతావరణాన్ని మార్చి, ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించామని అన్నారు.పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించిన కార్యకర్తలను, నేతలను చంద్రబాబు అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా కూటమే గెలవాలని ఆకాంక్షించారు. ప్రత్యర్థులు చిన్న తప్పును కూడా భూతద్దంలో చూపి దెబ్బతీయాలని చూస్తారని, అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. త్వరలోనే జిల్లా కమిటీలను ప్రకటించి, రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. "కొందరు తాత్కాలిక రాజకీయాలు చేసి ఇబ్బందులు పడతారు. మనం ప్రజల కోసం శాశ్వత రాజకీయాలు చేయాలి. అప్పుడే ప్రజల గుండెల్లో నిలిచిపోగలం. కష్టపడి పనిచేసే వారికే పార్టీలో పెద్దపీట వేస్తాం" అని ఆయన భవిష్యత్ కార్యాచరణను వివరించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa