ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల ఆస్తులు దోచిపెడుతున్నారు చంద్రబాబుపై జగన్ ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 05, 2025, 10:09 PM

చంద్రబాబు గారూ మీరు అనుకున్నంత పనీ చేశారు అంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా సంపదను కొల్లగొడుతోందని, కమీషన్ల కోసం ప్రభుత్వ ఆస్తులను తమ వారికి కట్టబెడుతోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం, అవినీతికి పరాకాష్ఠ అని జగన్ అభివర్ణించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వెనుక భారీ కుట్ర ఉందని జగన్ ఆరోపించారు. "ప్రజల ఆస్తులను దోచుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు పెడుతున్నట్టుంది. కమీషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ద్వారా మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు" అని చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రానికి శాశ్వతంగా అన్యాయం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని జగన్ విమర్శించారు. "1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే, పద్మావతి కాలేజీతో కలిపి 12 ఉన్నాయి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా కట్టారా మేం ఐదేళ్లలో 17 కొత్త కాలేజీలు ప్రారంభిస్తే, వాటిలో 5 ఇప్పటికే పనిచేస్తున్నాయి. మీరు బాధ్యతగా పూర్తి చేసి ఉంటే ఈ ఏడాదికి మిగిలిన కాలేజీల్లో కూడా తరగతులు మొదలయ్యేవి కదా అని ప్రశ్నించారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 2,360 నుంచి 4,910కి పెరిగాయని, తమ హయాంలోనే సుమారు 800 కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చాయని జగన్ గుర్తుచేశారు. "తమ పిల్లలను డాక్టర్లను చేయాలని తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుని ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలకు పంపిస్తున్నారు. అలాంటిది, మన రాష్ట్రంలోనే అందుబాటులోకి వస్తున్న వైద్య విద్యను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం" అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం వల్ల ఆ ప్రాంతాల్లో భూముల విలువ అమాంతం పెరిగిందని, ఆ భూములు, భవనాలను కొట్టేయడానికే ప్రైవేటీకరణ ప్లాన్ వేశారని జగన్ ఆరోపించారు. "పులివెందుల కాలేజీకి ఎన్‌ఎంసీ సీట్లు ఇస్తే, వద్దంటూ లేఖ రాసినప్పుడే మీ కుట్ర బయటపడింది. పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు" అని విమర్శించారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగాలు సమతుల్యంగా ఉండాలన్న కనీస అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జగన్ ఆరోపించారు. "గత 15 నెలల్లో నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన రూ.4,500 కోట్లకు గాను కేవలం రూ.600 కోట్లు చెల్లించి, దాదాపు రూ.4,000 కోట్లు ఎగ్గొట్టారు. దీనివల్ల పేదలకు వైద్యం అందకుండా పోయింది" అని అన్నారు. రూ.1000 దాటిన ప్రతీ వైద్యానికి వర్తించేలా, 3,257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించే పథకాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.శస్త్రచికిత్స చేయించుకున్న పేదలకు విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు అందించే 'ఆరోగ్య ఆసరా' పథకాన్ని కూడా ప్రభుత్వం సమాధి చేసిందని జగన్ విమర్శించారు. ఈ పథకానికి 15 నెలల్లో చెల్లించాల్సిన రూ.600 కోట్లను పూర్తిగా ఎగ్గొట్టారని ఆయన తెలిపారు. తమ హయాంలో 95 శాతం కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని, ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం మరో పెద్ద మోసం అని జగన్ అభిప్రాయపడ్డారు. "ప్రభుత్వం రూ.3,600 కోట్లు ఖర్చు చేయడానికే వెనుకాడుతుంటే, ప్రైవేటు కంపెనీలకు రూ.5,000 కోట్ల ప్రీమియం కడుతుందా? ఇది నమ్మశక్యమేనా? కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రైవేటు కంపెనీలు చేతులెత్తేస్తే ప్రజల పరిస్థితి ఏంటి? ప్రీమియంల పేరుతో మీవారి కంపెనీలకు దోచిపెట్టడానికే ఈ నిర్ణయం" అని జగన్ ఆరోపించారు.ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని జగన్ హెచ్చరించారు. "మేం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేస్తాం. మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వపరం చేసి పేదలకు అందుబాటులోకి తెస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa