ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ సీఎం ఫొటోలపై అభ్యంతరం తెలుపుతూ పిల్.. మొట్టికాయలు వేసిన కోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 07:48 PM

పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్.. అదేనండి ప్రజా ప్రయోజన వ్యాజ్యం.. దాన్నే సింపుల్‌గా పిల్ అని అంటున్నాం. ప్రజలందరినీ ప్రభావితం చేసే సామాజిక సమస్యల కోసం కోర్టులో పిటిషన్ వేయడానికి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వాడతారు. ఈ పిల్‌ను ఏ వ్యక్తి అయినా, లేదా ప్రజా సంఘమైనా కోర్టులో దాఖలు చేయవచ్చు. ప్రభుత్వ విధానాల్లో లోపాలు, ప్రజా ఆరోగ్యం, భద్రత, మానవ హక్కుల ఉల్లంఘన, పర్యావరణ కాలుష్యం తదితర అంశాల్లో సాధారణంగా హైకోర్టులు, సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తుంటారు. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి వేసిన పిల్.. హైకోర్టుకు ఆగ్రహం తెప్పించింది. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పనికిరాని పిల్ వేసి కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని పిటిషనర్‌కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు చట్టబద్ధంగా అనుమతి లేకుండా పెడుతున్నారని రైల్వే ఉద్యోగి కొండలరావు.. హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఫోటోల విషయంలో ప్రభుత్వం ఒక విధానం తీసుకునే వరకు డిప్యూటీ సీఎం ఫోటోలను తొలగించాలని కొండలరావు కోరారు. ఈ పిల్‌లో జీఏడీ ముఖ్య కార్యదర్శి, సహాయ కార్యదర్శి, పౌరసంబంధాలశాఖ డైరెక్టర్‌, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయితే, ఈ పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడుందని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిల్ వేశారని పేర్కొంటూ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం దాన్ని కొట్టేసింది. ప్రజలకు, సమాజానికి ఉపయోగపడే పిల్‌లు వేయాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ పిల్ రాజకీయ దృష్టితో, ఉద్దేశపూర్వకంగా దాఖలు చేసినట్లుగా కోర్టు అభిప్రాయపడింది. రాజకీయ లబ్ధికోసం కోర్టును వాడుకోవడం సరికాదని హైకోర్టు హెచ్చరించింది. నిజమైన ప్రజా ప్రయోజనాల పిటిషన్లను మాత్రమే విచారిస్తామని స్పష్టం చేసిన కోర్టు.. ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇది ప్రజల బాధ్యతని.. సమాజానికి ఉపయోగపడే విషయాలపై వేసిన పిటిషన్లను మాత్రమే కోర్టు పరిశీలిస్తుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, హైకోర్టు తీర్పుపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ఫోటోలు చూసి వైసీపీ పేటీఎం బ్యాచ్ దడుసుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa