ట్రెండింగ్
Epaper    English    தமிழ்

26 మంది ప్రాణాలకంటే డబ్బే ఎక్కువ విలువైనదా?: ప్రధాని మోదీకి అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్న

national |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 04:18 PM

ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ముఖ్యంగా 26 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల చర్యను దేశ ప్రజలే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ కూడా చేపట్టింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని నేరుగా ప్రధాని మోదీయే తెలిపారు. ఇలాంటి సందర్భంలో భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌కు అనుమతి ఇవ్వడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 26 మంది అమాయక ప్రజల ప్రాణాలకంటే మీకు డబ్బులే ఎక్కువయ్యాయా అంటూ ప్రశ్నించారు.


"అస్సాం ముఖ్యమంత్రికి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రికి, మిగతా బీజేపీ నాయకులు అందరికీ నేనడిగేది ఒక్కటే.. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరుల మతం ఏంటని అడిగి మరీ చంపిన పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని చెప్పే అధికారం మీకు లేదా?" అని ఒవైసీ ప్రశ్నించారు. ఒక క్రికెట్ మ్యాచ్‌తో బీసీసీఐకి వచ్చే రూ. 2000 కోట్లు, రూ. 3000 కోట్లు, ఉగ్రదాడిలో చనిపోయిన మన 26 మంది పౌరుల ప్రాణాల కంటే ఎక్కువ విలువైనవా? అని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నిలదీశారు.


ఒవైసీతో పాటు అనేకమంది విపక్ష నేతలు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంతో ఎలాంటి చర్చలు ఉండవని ప్రభుత్వం చెబుతూనే.. క్రికెట్ ఆడటం దాని వైఖరికి విరుద్ధమని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ దత్ విమర్శించారు. పహల్గాం దాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు కూడా ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. ఈ మ్యాచ్ తమ గాయాలను మరోసారి గుర్తు చేస్తుందని, తమ ప్రాణాలకు విలువ లేదని ఈ గేమ్ చూపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


"మీకు మ్యాచ్ ఆడాలని ఉంటే.. తుపాకీ తూటాలకు బలైన నా 16 ఏళ్ల తమ్ముడిని తిరిగి తీసుకురండి" అని బాధితుడి సోదరుడు సావన్ పర్మార్ కన్నీళ్లతో అన్నారు. ఉగ్రదాడిలో తన భర్తను కోల్పోయిన ఐశన్య ద్వివేది.. 26 మంది అమాయకులు చనిపోయినా బీసీసీఐకి ఏమాత్రం పట్టడం లేదని వ్యాఖ్యానించారు. తమ కుటుంబం నుంచి ఎవరూ చనిపోలేదు కాబట్టే వారికి ఆ బాధ తెలియడం లేదని వాపోయారు.


ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ మ్యాచ్‌ను ప్రసారం చేసే క్లబ్‌లు, రెస్టారెంట్‌లను బహిష్కరించాలని ప్రజలను కోరారు. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది.. ప్రజలు ఈ మ్యాచ్‌ను చూడవద్దని విజ్ఞప్తి చేశారు. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, "యుద్ధం, క్రికెట్ ఒకేసారి ఎలా సాధ్యం అవుతాయి? వారు దేశభక్తిని వ్యాపారంగా మార్చారు" అని మండిపడ్డారు.


విమర్శలపై స్పందించిన బీజేపీ నాయకులు ఈ మ్యాచ్‌ను వ్యతిరేకించడం సరికాదని అన్నారు. "కాంగ్రెస్ హయాంలో కూడా మ్యాచ్లు జరిగాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్ జరిగినప్పుడు మాత్రమే వారికి దేశభక్తి గుర్తుకొస్తుంది. మేము పాక్‌ను భూమి మీదనే కాదు, వారి గడ్డపై కూడా ఓడించాం. ఇప్పుడు విదేశీ గడ్డపై కూడా ఓడిస్తాం. మనం మైదానం నుంచి వెనక్కి తగ్గకూడదు" అని బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఈ రెండు అంశాలు వేర్వేరు అని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. ఆట అనేది ఒక భావోద్వేగమని, దానిని వ్యతిరేకించడం సరికాదని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa