హిందీని కేవలం సంభాషణలకు, అధికారిక కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయకూడదని, సైన్స్, టెక్నాలజీ, న్యాయం, పోలీసు యంత్రాంగం వంటి కీలక రంగాలకు కూడా దానిని మూలస్తంభంగా మార్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హిందీ ఇతర భారతీయ భాషలకు పోటీ కాదని, వాటన్నిటికీ ఒక నేస్తం మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు.హిందీ దివస్ సందర్భంగా ఆదివారం జరిగిన ఐదవ అఖిల భారత అధికార భాషా సమ్మేళనంలో అమిత్ షా ప్రసంగించారు. "అన్ని పనులు భారతీయ భాషల్లో జరిగినప్పుడు, ప్రజలతో మన బంధం దానంతట అదే బలపడుతుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక ప్రత్యేక పిలుపునిచ్చారు. తమ మాతృభాషలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని, ఆ లేఖలకు తాను కూడా వారి భాషలోనే సమాధానం ఇస్తానని హామీ ఇచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో భారతీయ భాషలకు, సంస్కృతికి పునరుజ్జీవనం లభించిందని షా ప్రశంసించారు. ఐక్యరాజ్యసమితి, జీ-20 వంటి అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ హిందీలో మాట్లాడి భారతీయ భాషల గౌరవాన్ని ఇనుమడింపజేశారని గుర్తుచేశారు. బానిసత్వపు చిహ్నాల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు ప్రధాని మోదీ తీసుకున్న 'పంచ ప్రాణ్' లో భాషలకు కూడా కీలక పాత్ర ఉందని తెలిపారు.ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పిన మాటలను ఆయన ఉటంకించారు. 'స్వరాజ్, స్వధర్మం, స్వభాష' అనే మూడు అంశాలు దేశ ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నాయని అన్నారు. పిల్లలకు వారి మాతృభాషలోనే విజ్ఞానాన్ని అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. వేరే భాషలో నేర్చుకోవడం వల్ల పిల్లల అభ్యాస సామర్థ్యం 30 శాతం వరకు తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. 'భారతీయ భాషా అనుభాగ్' ఏర్పాటుతో అధికార భాషా విభాగం ఇప్పుడు పూర్తిస్థాయి శాఖగా మారిందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa