తిరుపతిలోని అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ వద్ద విగ్రహం వ్యవహారం ఏపీలో రాజకీయ కాకకు కారణమవుతోంది. దీనిపై అధికార. విపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారంటూ భూమన చేసిన వ్యాఖ్యలపై ఆయన మీద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే అలిపిరి పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చారు. గురువారం రోజున తిరుపతి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు అందించారు. అయితే తనకు కొన్ని రోజులు పనులు ఉన్నాయని.. సెప్టెంబర్ 23వ తేదీన విచారణకు వస్తానని భూమన కరుణాకర్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.
మరోవైపు తిరుపతిలోని అలిపిరి ఓల్డ్ చెక్ పోస్టు వద్ద ఉన్న కారు పార్కింగ్ సమీపంలో విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని.. ఇది శ్రీమహావిష్ణువు విగ్రహం అంటూ భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యులు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే అది శ్రీమహావిష్ణువు విగ్రహం కాదని.. శనీశ్వరుడి విగ్రహమని, తయారీలో లోపం తలెత్తటంతో శిల్పి అక్కడే వదిలేశారంటూ టీటీడీ, ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చాయి. ఈ క్రమంలోనే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ టీటీడీ డిప్యూటీ ఈవో గోవిందరాజు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో అలిపిరి పోలీస్ స్టేషన్లో భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. గురువారం రోజున విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వగా.. ఆయన తర్వాత వస్తానని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు శనీశ్వరుడి విగ్రహానికి శంఖుచక్రాలు ఉంటాయా అని భూమన ప్రశ్నిస్తున్నారు. విగ్రహాన్ని ఎవరైనా అలా పడేస్తే దాన్ని అక్కడి నుంచి తరలించాల్సిన బాధ్యత టీటీడీకి లేదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని కన్నయ్య చారి అనే శిల్పి చెక్కినట్లు తెలిసింది. ఆయన కుమారుడు గురుస్వామి దీనిపై క్లారిటీ ఇచ్చారు.
22 ఏళ్ల కిందట రాయలచెరువు రోడ్డులో తమకు విగ్రహాలు తయారు చేసే షెడ్డు ఉండేదని. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి శనీశ్వరుడి విగ్రహం తయారు చేయించి ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత అతను చనిపోయాడని.. తర్వాత తాము అలిపిరిలోని శిల్పా క్వార్టర్స్కు వెళ్లిపోయినట్లు వివరించారు. 2003లో జరిగిన అలిపిరిలో బాంబుదాడి ఘటన నేపథ్యంలో అక్కడి నుంచి తమను ఖాళీ చేయించారని.. ఆ సమయంలోనే ఈ భారీ శనీశ్వరుడి విగ్రహాన్ని అక్కడే వదిలేశామని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa