ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 07:03 PM

శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే సామాన్య భక్తుల వసతి కష్టాలను తీర్చబోతోంది. భక్తుల కోసం వెంకటాద్రి నిలయం పేరుతో మరో వసతి గృహాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ వెంకటాద్రి నిలయం PAC-5 బిల్డింగ్‌ను బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎల్లుండి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శనానికి ప్రతిరోజ దాదాపు 90 వేల భక్తుల వరకు వస్తుంటారు. అయితే.. 50 వేల మంది భక్తులకు మాత్రమే తిరుమల కొండపై వసతి లభిస్తోంది. మిగతావారు తిరుమలలో అందుబాటులోనున్న గెస్ట్‌ హౌస్‌లు, యాత్రికుల వసతి గృహాలు, మఠాల్లో సేద తీరుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో.. తిరుమల కొండకు వచ్చే భక్తుల వసతి సమస్యను తీర్చేందుకు టీటీడీ వెంకటాద్రి నిలయం PAC-5 పేరుతో మరో అదనపు బిల్డింగ్‌ను నిర్మించింది. ఇక.. 2018లో 102 కోట్ల రూపాయలతో వెంకటాద్రి నిలయం వసతి సముదాయం ప్రాజెక్టును చేపట్టింది. 5 అంతస్తుల్లో రెండు బ్లాక్‌లుగా నిర్మించిన వెంకటాద్రి నిలయంలో కొత్తగా 4 వేల మంది భక్తులకు వసతి కల్పించబోతోంది. 1500 మంది భోజనం చేసేలా రెండు అతిపెద్ద డైనింగ్ హాల్స్‌.. ప్రతి అంతస్తులో 2 ఆర్వో ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. అలాగే.. 16 డార్మెంటరీ హాల్స్, 2500 లగేజీ లాకర్లు అందుబాటులోకి తెచ్చింది. 216 మరుగుదొడ్లు, 216 స్నానపు గదులను నిర్మించింది. తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్‌కు దగ్గరలోనే భక్తులకు అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపట్టింది. ఇక.. వెంకటాద్రి నిలయంలో వేస్టేజ్‌ రీసైక్లింగ్‌ మెషిన్లు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి. ఈ నెల 25న బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటాద్రి నిలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలోనే.. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, టీటీడీ ఈవో, అదనపు ఈవోలు వెంకటాద్రి నిలయాన్ని సందర్శించారు. బిల్డింగ్‌ మొత్తాన్ని కలియ తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa