దేశవ్యాప్తంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఈ నవరాత్రుల్లో రకరకాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో దేశం మొత్తం హోరెత్తిపోతోంది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో ఈ నవరాత్రోత్సవాలు పూర్తయ్యేవరకు.. నాన్వెజ్ అమ్మకాలను బంద్ చేయాలని.. దుకాణదారులకు ఆదేశాలు ఇచ్చారు. మాంసంతోపాటు చేపలు, గుడ్లు కూడా ఈ 9 రోజుల పాటు విక్రయించవద్దని పేర్కొన్నారు. అయితే దీనిపై నాన్వెజ్ ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇలా చేయడం పౌరుల హక్కులకు భంగం కలిగించినట్లేనని వాదిస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని మతపరమైన నగరమైన మైహర్లో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు.. నవరాత్రి వేడుకల సందర్భంగా.. చేపలు, గుడ్లు, మాంసం అమ్మకాలను నిషేధించినట్లు ఆ జిల్లా కలెక్టర్ దివ్య పటేల్ తాజాగా వెల్లడించారు. మైహార్ను శారదా దేవి ఆలయానికి నిలయంగా భావిస్తారు. నవరాత్రి సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ శారదా దేవి ఆలయాన్ని సందర్శిస్తారని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మైహార్ను మతపరమైన నగరంగా ప్రకటించిందని దివ్య పటేల్ గుర్తు చేశారు. మైహర్ మాత్రమే కాకుండా.. భోపాల్ నగరంలోనూ ఈ 9 రోజుల పాటు మాంసం, గుడ్లు, చేపల విక్రయాలపై నిషేధం అమల్లో ఉంటుందని అక్కడి అధికారులు కూడా స్పష్టం చేశారు. మైహర్, భోపాల్ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్లోని మరిన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఆదేశాలే స్థానిక అధికారులు జారీ చేశారు.
అయితే ఇలా మాంసం, గుడ్లు, చేపల విక్రయాలపై నిషేధం విధిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు నెటిజన్లు, స్థానికులు.. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మతపరమైన విశ్వాసాలను గౌరవించాలని.. 9 రోజుల పాటు నిషేధాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొందరు కేవలం నాన్వెజ్ మాత్రమే కాకుండా ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆల్కహాల్, ఇతర పదార్థాలకు కూడా ఈ నిషేధాన్ని విస్తరించాలని సూచిస్తున్నారు.
ఇక ఈ నిర్ణయంపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోంది. ఇలా నాన్వెజ్పై నిషేధం విధించడాన్ని సీపీఐ(ఎం) ఎంపీ అమ్ర రామ్ తీవ్రంగా ఖండించారు. భారతదేశంలోని సగం మందికి పైగా ప్రజలు మాంసాహారం తింటారని తెలిపారు. ఒక వ్యక్తి ఏం తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి అనేది వారి పర్సనల్ ఛాయిస్ అని.. దేశంలో ఉన్న ప్రతీ వ్యక్తికి.. ఈ స్వేచ్ఛను భారత రాజ్యాంగం హామీ ఇస్తుందని వెల్లడించారు. ఒకరు ఏ మతాన్ని పాటించాలి.. ఎలాంటి ఆచారాలను పాటించాలి అనేది పూర్తిగా వారి ఇష్టమని తేల్చి చెప్పారు.
మరోవైపు.. మధ్యప్రదేశ్లో ఇలా నాన్వెజ్పై నిషేధం విధించడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఈ ఏడాది మార్చి నెలలో కూడా ఇలాంటి నిషేధం విధించారు. ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే.. వారి దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా నవరాత్రుల సందర్భంగా అధికారులు నాన్వెజ్పై విధించిన నిషేధంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇది నాన్వెజ్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని తీసుకున్న నిర్ణయం అంటూ కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa