వడ్డీ కాసుల వాడు, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి భారీ ఎత్తున విరాళాలు, బంగారు, వెండి, ఇతర విలువైన ఆభరణాలను భక్తులు అందిస్తూనే ఉంటారు. ఇక భారీ మొత్తంలో నగదు.. బంగారం, వెండి ఆభరణాలు అందించే భక్తులు నేరుగా హుండీలో వేయకుండా.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు అందిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా విశాఖకు చెందిన ఓ బిజినెస్మెన్ స్వామి వారికి ఖరీదైన కానుకను సమర్పించారు.
విశాఖకు చెందిన వ్యాపారవేత్త, హిందుస్థాన్ ఎంటర్ ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తాన్రావు.. తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుకను అందించారు. తన సతీమణి కుంకుమ రేఖతో కలిసి.. రూ.3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని స్వామి వారికి బహూకరించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు సమక్షంలో ఈ బంగారు యజ్ఞోపవీతం తీసుకొచ్చి అందించారు.
ఈ సందర్భంగా పువ్వాడ మస్తాన్రావు, కుంకుమ రేఖ దంపతులను అభినందించిన టీటీడీ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను వారికి అందించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్తో పాటు టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారాంలు హాజరయ్యారు.
మరోవైపు.. తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తిరుమలకు వచ్చారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం ఘనంగా జరిగింది. బుధవారం సాయంత్రం మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. రాత్రి 9 గంటలకు నిర్వహించే పెద్దశేష వాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి ధర్మకర్తల మండలి హయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa