ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వారికి వచ్చే నెల పింఛన్ వస్తుందా, రాదా.. క్లారిటీ ఇదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 08:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ నెల పింఛన్లకు సంబంధించి పింఛన్‌దారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద దివ్యాంగులు, వృద్ధులు. వితంతువులకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దివ్యాంగ పింఛన్లలో అనర్హులు ఎక్కువమంది ఉన్నారనే అనుమానంతో ప్రభుత్వం ఇటీవల వైకల్య నిర్ధరణ పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా సదరం ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. దివ్యాంగుల వైకల్య శాతాన్ని పరిశీలించింది. వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా దివ్యాంగ పింఛన్లలోని కొంతమంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. వైకల్య శాతం 40 కంటే తక్కువగా ఉన్నట్లు తేలిన వారికి నోటీసులు అందించారు. దీంతో దివ్యాంగ పింఛన్లు పొందేవారిలో ఆందోళన వ్యక్తమైంది. వైకల్యం ఉన్నప్పటికీ తక్కువ శాతం చూపుతున్నారంటూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి.


ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం.. నోటీసులు అందుకున్నవారిలో 90 శాతానికి పైగా అప్పీలు చేసుకోవటంతో నోటీసులు అందించిన వారందరికీ కూడా సెప్టెంబర్ నెలలో పింఛన్లు అందించాలని నిర్ణయించింది. ఆ మేరకు నోటీసులు అందుకున్న లబ్ధిదారులకు కూడా సెప్టెంబర్ నెలలో పింఛన్లు అందించారు. ఇక దివ్యాంగ పింఛన్ల జాబితాలో ఉంటూ నోటీసులు అందుకున్న వారిలో ఎవరైనా వృద్ధులు, వితంతువుల కేటగిరీలోకి వచ్చే వారుంటే.. అలాంటి వారిని ఆయా పింఛన్ల రకంలోకి మార్చి పింఛన్ల ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అలాంటి వారికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో అందరికీ పింఛన్లు అందగా.. ఇప్పుడు అక్టోబర్ నెల రావటంతో నోటీసులు అందుకున్న వారిలో ఆసక్తి మొదలైంది.


ఈ క్రమంలోనే ఏపీలో పింఛన్లపై కీలక అప్ డేట్ వచ్చింది. పింఛన్ వెరిఫికేషన్‌లో భాగంగా గత నెలలో పింఛన్ రద్దు లేదా పింఛన్ రకం మార్పు లేదా పింఛను కొనసాగింపు నోటీసులు అందుకున్న వారికి తదుపరి సదరం అసెస్‌మెంట్ అయ్యేంతవరకు పింఛన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. నోటీసులు అందుకున్నవారు అప్పీలు చేసుకోగా.. అలాంటి వారికి రీఅసెస్మెంట్ కోసం ప్రభుత్వం ఇంకా తేదీలు ఖరారు చేయలేదు.


మరోవైపు అక్టోబర్ నెల సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎవరైతే పింఛన్లు అందుకున్నారో వారందరికీ యథావిధిగా అక్టోబర్ నెల పింఛన్లు కూడా అందుతాయని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa